బ్యాంక్ అధికారులమంటూ
కాల్ చేస్తున్న సైబర్ క్రిమినల్స్
అకౌంట్స్ అప్ డేట్ చేస్తామంటూ మనీ ట్రాన్స్ ఫర్
వారంలో గ్రేటర్ పోలీసులకు 10 కంప్లయింట్స్
హైదరాబాద్,వెలుగు: సైబర్ గ్యాంగ్స్ ట్రూ కాలర్ యాప్ లో ఫేక్ నంబర్స్ తో బ్యాంకులు,ఈ–కామర్స్, కస్టమర్ కేర్ సర్వీసెస్ పేరుతో కాల్స్ చేస్తూ డబ్బులు కొట్టేస్తున్నాయి. క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్న అశోక్ కి శుక్రవారం ఓ కాల్ వచ్చింది. ట్రూ కాలర్ లో తన అకౌంట్ ఉన్న బ్యాంకు పేరుతో మేనేజర్ అని ఉంది. అశోక్ కాల్ లిఫ్ట్ చేయగా..అవతలి వ్యక్తి బ్యాంక్ మేనేజర్నని హిందీలో మాట్లాడాడు. 2021 ఫైనాన్సియల్ ఇయర్లో అకౌంట్స్ అప్డేట్ చేస్తున్నామని చెప్పాడు. డెబిట్ కార్డ్, సీవీవీ నంబర్స్ తెలుసుకున్నాడు. అకౌంట్ అప్డేట్ అయ్యిందని ఓటీపీ చెప్తే యాక్సెస్ అవుతుందని నమ్మించాడు. అశోక్ ఓటీపీ చెప్పడంతో అతడి అకౌంట్ నుంచి రూ.35 వేలు ట్రాన్స్ ఫర్ చేసుకున్నాడు. దీన్ని గమనించిన అశోక్ తను రిసీవ్ చేసుకున్న నంబర్ కి కాల్ బ్యాక్ చేశాడు. స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయినట్టు గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు. ఇలా ఫేక్ ట్రూ కాలర్ నంబర్స్ తో సైబర్ క్రిమినల్స్ వరుస నేరాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి కేసులకు సంబంధించి వారంలో 10 కంప్లయింట్స్ వచ్చినట్లు గ్రేటర్ పోలీసులు తెలిపారు.
జార్ఖండ్ లోని జాంతారా గ్యాంగ్స్
సైబర్ నేరాలపై జనాల్లో అవేర్ నెస్ పెరగడంతో క్రిమినల్స్ ఫేక్ ట్రూ కాలర్ ను క్రియేట్ చేస్తున్నారు. జార్ఖండ్ లోని జాంతారా గ్యాంగ్ బ్యాంకింగ్ సెక్టార్ ను టార్గెట్ చేసింది. జాంతారాలోని కరంతాడ్ పీఎస్ లిమిట్స్ లో ఒక్కో గ్రామంలో సుమారు 500 కుటుంబాల్లో 300 కుటుంబాలు బ్యాంకు ఫ్రాడ్స్ చేస్తున్నాయి. ఫేక్ అడ్రెస్ లతో వీరు సిమ్ కార్డులు కొని గ్యాంగ్స్ గా ఏర్పడి కస్టమర్లు ఎక్కువగా ఉన్న బ్యాంకులను టార్గెట్ చేస్తున్నారు. ఆయా బ్యాంకుల పేరుతో పాటు మేనేజర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్,కస్టమర్ కేర్ పేర్లు ట్రూ కాలర్ లో డిస్ ప్లే అయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఒక్కో గ్రూప్లోని10 మంది ఫేక్ ట్రూ కాలర్స్ యాక్టివేట్ చేస్తున్నారు. ఇలా క్రియేట్ చేసిన ఫేక్ ట్రూ కాలర్ నంబర్స్తో బ్యాంక్ నుంచి కాల్స్ చేస్తున్నట్లు ఫోన్లు చేస్తున్నారు. ఇలాంటి కాల్స్ రిసీవ్ చేసుకున్న బ్యాంక్ కస్టమర్లు నిజమైన బ్యాంక్ కాల్గా నమ్మి సైబర్ క్రిమినల్స్ అడిగిన అకౌంట్ నంబర్స్తో పాటు ఏటీఎం,సీవీవీ,ఓటీపీ నంబర్స్ చెప్పేస్తున్నారు. ఇందులో ఎక్కువగా కేవైసీ,అకౌంట్,డెబిట్ కార్డ్ అప్డేట్ పేరుతో సైబర్ క్రిమినల్స్ అకౌంట్స్ ఖాళీ చేస్తున్నారు.
ఈజీగా ఉంటుందని..
ఫేక్ ట్రూ కాలర్ చీటింగ్పై సైబర్ క్రైమ్ పోలీసులు ఫోకస్ పెట్టారు. ఫోన్ టవర్ లొకేషన్స్,బ్యాంక్ అకౌంట్స్ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ట్రూ కాలర్ యాక్సెస్ ఈజీగా ఉంటుందని, ఒకరి నంబర్ పై మరొకరి పేరు ఫీడ్ చేయొచ్చని, దీంతో చీటర్స్, సైబర్ క్రిమినల్స్ మోసాలు చేస్తున్నట్లు సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ చెప్పారు. దీనిపై జనాల్లో అవేర్ నెస్ రావాలన్నారు. బ్యాంకులు కాల్ చేసి ఓటీపీ నంబర్ అడగరని, ఇలా అడిగితే వారు సైబర్ క్రిమినల్స్ అని గుర్తించాలని పేర్కొన్నారు. కాంటాక్ట్ లో లేని ట్రూ కాలర్ నంబర్స్ ను చెక్ చేసుకోవాలని ఆయన సూచించారు.