భద్రాద్రికొత్తగూడెం/ బూర్గంపహాడ్/ పాల్వంచ, వెలుగు: విద్యాసంస్థలు, హాస్టళ్లల్లోని విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, కలుషిత ఆహార ఘటనలు జరిగితే హెచ్ఎంలు, వార్డెన్లు, ఆఫీసర్లపై కఠిన చర్యలు తీసుకుంటానని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ అంకిత్ హెచ్చరించారు. కలెక్టరేట్ నుంచి పలు శాఖల ఆఫీసర్లతో మంగళవారం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. అనంతరం మణుగూరు మహాత్మ జ్యోతిబా పూలే గురుకుల బాలికల పాఠశాలలో జరిగిన కలుషిత ఆహార ఘటనపై అసహనం వ్యక్తం చేశారు.
విద్యార్థులకు అందజేసే ఆహారం నాణ్యతతో ఉండాలన్నారు. బూర్గంపహాడ్ తెలంగాణ రెసిడెన్షియల్ కాలేజ్, కేజీబీవీ స్కూల్ను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలు, భోజన నాణ్యత, పాఠశాల నిర్వహణ తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు. పాల్వంచ పట్టణంలో నవభారత్ టీడబ్ల్యూఆర్ బాలికల గురుకులాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. తరగతి గదులను తనిఖీ చేస్తూ విద్యార్థుల సామర్థాలను పరిశీలించారు.
ఇంటర్ పరీక్ష నిర్వహణ పరిశీలన
జనగామ అర్బన్, వెలుగు : ఇంటర్ పరీక్ష కేంద్రాలను మంగళవారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా సందర్శించారు. ధర్మకంచ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కొనసాగుతున్న పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థుల సంఖ్య, గైర్హాజరు వివరాలను అడిగి తెలుసుకున్నారు.
