నిలువెత్తు డబ్బు నోట్లతో ముంచెత్తిన అభిమానం : గుజరాత్ లో గాయకుడికి అరుదైన గౌరవం..

నిలువెత్తు డబ్బు నోట్లతో ముంచెత్తిన అభిమానం : గుజరాత్ లో గాయకుడికి అరుదైన గౌరవం..

గుజరాత్‌లోని జునాగఢ్‌ జిల్లా, మాలియా హతినా గ్రామంలో జరిగిన ఒక భజన కార్యక్రమంలో గాయకుడు కవిరాజ్ జిగ్నేష్‌పై భక్తులు కరెన్సీ నోట్ల వర్షం కురిపించిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. 
 
ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. జిగ్నేష్ భక్తి పాటలు పాడుతుండగా, భక్తులు పరవశించిపోయి వేదికపైకి కరెన్సీ నోట్లను విసరడం మొదలుపెట్టారు.  మొదట చిన్న మొత్తంలో మొదలైన ఈ ప్రక్రియ, సమయం గడిచేకొద్దీ పెరిగింది. కొందరు భక్తులు ఏకంగా సంచులు, గోనె సంచులతో నోట్లను తీసుకువచ్చి వేదికపై కుమ్మరించారు.

గాయకుడు కవిరాజ్ జిగ్నేష్ చుట్టూ నోట్లు కుప్పలుగా పేరుకుపోయాయి. ఆ నోట్లను సర్దడానికి అక్కడ ఉన్న వాలంటీర్లు చాలా కష్టపడాల్సి వచ్చింది. ప్రముఖ జానపద కళాకారుడు మాయాభాయ్ అహిర్ కుమారుడు జయరాజ్ అహిర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని నోట్లను సమర్పించారు.

డైరో అంటే ఏమిటి?
ఇది గుజరాత్ సంస్కృతిలో ఒక భాగం. సంగీతం, కథలు, హాస్యం కలిపి సాగే ఈ భక్తి కార్యక్రమంలో భక్తులు తమకు నచ్చిన కళాకారులకు లేదా దైవ కార్యాలకు డబ్బును కానుకగా ఇవ్వడం అక్కడ ఒక ఆచారం.

ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్ల మధ్య పెద్ద చర్చ నడిచింది. దీనిపై నిర్వాహకులు క్లారిటీ ఇచ్చారు. ఈ డబ్బు గాయకుడి వ్యక్తిగత ఆదాయం కాదని... సేకరించిన ప్రతి రూపాయిని మతపరమైన పనులు, పేదలకు సహాయం, సామాజిక సంక్షేమ కార్యక్రమాల కోసం ఉపయోగిస్తామని వారు స్పష్టం చేశారు.

సోషల్ మీడియాలో కొందరు దీనిని చూసి డబ్బు వృధా అని విమర్శిస్తుంటే, మరికొందరు మాత్రం ఇది గుజరాత్ ప్రజల భక్తికి, ఉదారతకు నిదర్శనమని ప్రశంసిస్తున్నారు. ఏదేమైనా, ఒక గాయకుడు నోట్ల కుప్పల మధ్య కూర్చుని పాటలు పాడుతున్న దృశ్యం మాత్రం దేశవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యపరిచింది.