Airtel Xstream AirFiber : ఎయిర్టెల్ 5G వైఫై బాక్స్ ఇదే.. ఎలా పని చేస్తుందంటే..?

Airtel Xstream AirFiber : ఎయిర్టెల్ 5G వైఫై బాక్స్ ఇదే.. ఎలా పని చేస్తుందంటే..?

Airtel Xstream AirFiber : ప్రముఖ టెలికాం సంస్థ భారతి ఎయిర్‌టెల్‌ కంపెనీ ఎక్స్‌ట్రీమ్‌ ఎయిర్‌ఫైబర్‌ పేరిట ఫిక్స్‌డ్‌ వైర్‌లెస్‌ సర్వీసులను ప్రారంభించింది. ముందుగా దేశ రాజధాని ఢిల్లీ, ముంబయి నగరాల్లో మాత్రమే ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించింది. ఫైబర్‌ నెట్‌వర్క్‌ అందుబాటులో లేని నగరాలతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో బ్రాండ్‌ బ్యాండ్‌ కనెక్షన్‌ అందించేందుకు ఈ ఎయిర్‌ ఫైబర్‌ సేవలు ఉపయోగపడతాయని ఎయిర్ టెల్ సంస్థ చెప్పింది. 

మన దేశంలో ఫైబర్‌ నెట్‌వర్క్‌ విస్తరణకు కొన్ని అవరోధాలు, అడ్డంకులు ఉన్నాయి. ఎయిర్‌ఫైబర్‌ ఆ లోటును పూడ్చనుంది. ప్రతి ఇంటికి వైఫై సర్వీసుల అందించేందుకు ఇది ఎంతగానో తోడ్పడుతుంది. ఫస్ట్ ఢిల్లీ, ముంబాయి నగరాల్లో సర్వీసులు ప్రారంభించి.. ఆ తర్వాత దేశ వ్యాప్తంగా సేవలు అందించాలని ఎయిర్ టెల్ సంస్థ టార్గెట్ పెట్టుకుంది. మేకిన్‌ ఇండియా ప్రోగ్రాం కింద ఎయిర్‌ ఫైబర్‌ డివైజులను తయారు చేసినట్లు ఎయిర్‌ కన్జూమర్‌ బిజినెస్‌ డైరెక్టర్‌ సారస్వత్‌ శర్మ తెలిపారు.

ఎలా పని చేస్తుందంటే..?

* ఎక్స్‌ట్రీమ్‌ ఎయిర్‌ఫైబర్‌ .. ప్లగ్‌ అండ్‌ ప్లే డివైజ్‌. వైఫై 6 టెక్నాలజీతో ఇది పని చేస్తుంది. 

*  64 డివైజుల వరకూ కనెక్ట్‌ చేసుకోవచ్చు. ఎయిర్‌టెల్‌ స్టోర్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.

* ఫైబర్‌ డివైజ్‌ కొనుగోలు చేసిన తర్వాత ఎక్స్‌ట్రీమ్‌ ఎయిర్‌ఫైబర్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. డివైజ్‌ మీద ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి వైఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. 

* ఎయిర్‌ ఫైబర్‌ నెలవారీ ప్లాన్‌ రూ.799గా ఎయిర్‌టెల్‌ నిర్ణయించింది. 100 ఎంబీపీఎస్‌ (Mbps) వేగంతో ఇంటర్నెట్‌ సేవలు అందుతాయి. 

* ఆరు నెలలకు కలిపి ఒకేసారి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సెక్యూరిటీ డిపాజిట్‌ కింద మరో రూ.2,500 చెల్లించాల్సి ఉంటుంది. 

* మొత్తంగా డిస్కౌంట్‌ పోగా రూ.7 వేల 733 చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం సింగిల్‌ ప్లాన్‌ మాత్రమే అందుబాటులో ఉంది. తర్వాత మెరుగైన సేవలతో మరిన్ని ప్లాన్స్ అందుబాటులోకి రానున్నాయి.