ఐఆర్​ ఇంత దారుణమా? ఎంప్లాయ్​ ఫ్రెండ్లీ గవర్నమెంట్​ఇదేనా : భట్టి విక్రమార్క

ఐఆర్​ ఇంత దారుణమా? ఎంప్లాయ్​ ఫ్రెండ్లీ గవర్నమెంట్​ఇదేనా : భట్టి విక్రమార్క

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు కేవలం 5 శాతం ఐఆర్​ ఇవ్వడం దారుణమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఎంప్లాయ్​ ఫ్రెండ్లీ గవర్నమెంట్​ అంటే ఇదేనా అని మంగళవారం ఓ ప్రకటనలో ప్రశ్నించారు. ఉద్యోగులను కడుపులో పెట్టుకుని చూసుకోవడం అంటే ఇట్లనే ఉంటదా? అని నిలదీశారు. దేశంలోనే ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఏందీ దారుణమని ఆయన ఫైర్​ అయ్యారు. వెంటనే 20 శాతం ఐఆర్​ ప్రకటించాలని డిమాండ్​ చేశారు. పెండింగ్​లో పెట్టిన మూడు డీఏలనూ వెంటనే క్లియర్​ చేయాలన్నారు.

ఏడాదిగా పెండింగ్​ పెట్టిన మెడికల్​ బిల్లులను వెంటనే చెల్లించాలన్నారు. ‘‘పీఆర్సీ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి బాగాలేదన్నారు. పీఆర్సీ గడువు పూర్తవ్వడానికి 6 నెలల ముందే కమిటీని ఏర్పాటు చేసి నివేదిక తెప్పించుకోవాల్సి ఉంటుంది. కానీ, గడువు పూర్తయ్యాక పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయడంలో ప్రభుత్వ చిత్తశుద్ధి ఏంటో తెలియజేస్తున్నది. తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే ఉద్యోగులెన్నడూ ఇంత తక్కువ ఐఆర్​ను చూడలేదు. ఐదేండ్లలో పెరిగిన ధరలకు.. ప్రకటించిన ఐఆర్​కు ఏ మాత్రం పొంతనే లేదు. ఈ ఐఆర్​ను చూసి 2.75 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు, 2 లక్షల మంది పెన్షనర్లు షాకయ్యారు’’ అని భట్టి పేర్కొన్నారు.