సోహైల్ ​యాక్సిడెంట్ కేసు.. బోధన్ సీఐ ప్రేమ్ కుమార్ అరెస్ట్

సోహైల్ ​యాక్సిడెంట్ కేసు..  బోధన్ సీఐ ప్రేమ్ కుమార్ అరెస్ట్
  •     హైదరాబాద్​లో అదుపులోకి తీసుకున్న పోలీసులు 
  •     యాక్సిడెంట్ కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకును తప్పించే యత్నం 
  •     ఫోన్ కాల్స్ డేటా, ఇతర ఆధారాలు సేకరించిన పోలీసులు 
  •     షకీల్ స్నేహితుడు అబ్దుల్ వాసే కూడా అరెస్ట్ 
  •     త్వరలో లొంగిపోనున్న మాజీ ఎమ్మెల్యే?  

నిజామాబాద్, వెలుగు: బోధన్ ​మాజీ ఎమ్మెల్యే షకీల్ ​కొడుకు సోహైల్ ​యాక్సిడెంట్ కేసులో టౌన్​ సీఐ ప్రేమ్​కుమార్​ అరెస్ట్ అయ్యారు. ప్రజా భవన్ ఎదుట బారికేడ్లను ఢీకొట్టిన ఘటనలో సోహైల్​ను కాపాడేందుకు ప్రేమ్ కుమార్ యత్నించారని దర్యాప్తులో ఆఫీసర్లు నిర్ధారించారు. ఫోన్ కాల్స్ డేటాతో పాటు ఇతర ఆధారాలు సేకరించిన పోలీసులు ఆదివారం ఆయనను హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే షకీల్​ స్నేహితుడు అబ్దుల్​ వాసేను కూడా అదుపులోకి తీసుకున్నారు. గత డిసెంబర్ 23న అర్ధరాత్రి 2.45 గంటలకు మాజీ ఎమ్మెల్యే షకీల్ ​కొడుకు సోహైల్​ కారు.. వేగంగా వచ్చి ప్రజా భవన్​ఎదుట బారికేడ్లను ఢీకొట్టింది.

కారులో సోహైల్​తో పాటు ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు ఉన్నట్లు పంజాగుట్ట పోలీసులు గుర్తించారు. కేసు నుంచి సోహైల్​ను తప్పించడానికి అతడి ఇంట్లో పనిచేసే అబ్దుల్​ ఆసిఫ్​ను నిందితుడిగా చేర్చే ప్రయత్నం చేశారు. యాక్సిడెంట్ ​తర్వాత సోహైల్​ను బ్రీత్ ఎనలైజ్​టెస్ట్​ కోసం స్టేషన్​కు తీసుకెళ్లారు. కానీ సోహైల్ అక్కడి నుంచి బయటకొచ్చి దుబాయ్​ పారిపోయాడు. కేసును తప్పుదోవ పట్టించడంపై హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి సీరియస్ అయ్యారు. పంజాగుట్ట సీఐ దుర్గారావును సస్పెండ్ చేశారు.

సీఐ దుర్గారావుతో డీల్ కుదిర్చింది సీఐ ప్రేమ్ కుమార్ అని దర్యాప్తులో తేలడంతో తాజాగా ఆయనను అరెస్ట్ చేశారు. డీల్ కోసం డబ్బు సర్దుబాటు చేసిన అబ్దుల్ వాసేను కూడా అదుపులోకి తీసుకున్నారు. సోహైల్​పై ఇదివరకే లుక్ ఔట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు నిందితుడిని తప్పించినందుకు షకీల్​పైనా కేసు పెట్టారు. అయితే, దుబాయ్​లో ఉన్న షకీల్ ఈ వారంలో వచ్చి పోలీసుల ముందు లొంగిపోనున్నట్లు తెలిసింది.  

బీఆర్ఎస్​తో అంటకాగి.. 

2009 ఎస్ఐ బ్యాచ్​కు చెందిన ప్రేమ్​కుమార్​ ప్రమోషన్​ తర్వాత 2021 అక్టోబర్​25న బోధన్​ టౌన్ ​సీఐగా వచ్చారు. అప్పటి రూలింగ్ పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్​ రెకమెండేషన్​తో ఆయన పోస్టింగ్ పొందారని, అందుకే పూర్తిగా ఆయన అదుపాజ్ఞల్లో పని చేశారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. జులై 2023లో షకీల్​పై హత్యాయత్నం చేశారంటూ మున్సిపల్ ​చైర్​పర్సన్​ తూము పద్మ భర్త, కౌన్సిలర్ శరత్​రెడ్డితో పాటు మరో కౌన్సిలర్​ మీర్​నజీర్​అలీ, ఎంఐఎం లీడర్లు నవీద్, అల్తాఫ్, సమీర్​పై ప్రేమ్​కుమార్ కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది.

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎడపల్లి మండలంలో కాంగ్రెస్​లీడర్లపై ఆయన లాఠీచార్జ్​ చేయడం దుమారం రేపింది. ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ ఓడిపోగా, కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గెలిచారు. ఆ తర్వాత డిసెంబర్ 5 నుంచి ప్రేమ్ కుమార్ లీవ్​లో వెళ్లిపోయారు. లీవ్ కంప్లీట్ అయ్యాక తిరిగి విధుల్లో చేరిన ఆయనను నిజామాబాద్ సీసీఎస్​కు ఎటాచ్ ​చేశారు. ఆయనను సీసీఎస్​లో సీఐగా పూర్తి స్థాయి ట్రాన్స్ ఫర్ చేస్తూ శనివారం సాయంత్రం ఆర్డర్స్ వచ్చాయి. సోమవారం బాధ్యతలు తీసుకోవడానికి ఆయన సిద్ధం కాగా, ఆదివారమే హైదరాబాద్​లో అరెస్ట్ అయ్యారు.