
- హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు
- యాక్సిడెంట్ కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకును తప్పించే యత్నం
- ఫోన్ కాల్స్ డేటా, ఇతర ఆధారాలు సేకరించిన పోలీసులు
- షకీల్ స్నేహితుడు అబ్దుల్ వాసే కూడా అరెస్ట్
- త్వరలో లొంగిపోనున్న మాజీ ఎమ్మెల్యే?
నిజామాబాద్, వెలుగు: బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహైల్ యాక్సిడెంట్ కేసులో టౌన్ సీఐ ప్రేమ్కుమార్ అరెస్ట్ అయ్యారు. ప్రజా భవన్ ఎదుట బారికేడ్లను ఢీకొట్టిన ఘటనలో సోహైల్ను కాపాడేందుకు ప్రేమ్ కుమార్ యత్నించారని దర్యాప్తులో ఆఫీసర్లు నిర్ధారించారు. ఫోన్ కాల్స్ డేటాతో పాటు ఇతర ఆధారాలు సేకరించిన పోలీసులు ఆదివారం ఆయనను హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ స్నేహితుడు అబ్దుల్ వాసేను కూడా అదుపులోకి తీసుకున్నారు. గత డిసెంబర్ 23న అర్ధరాత్రి 2.45 గంటలకు మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహైల్ కారు.. వేగంగా వచ్చి ప్రజా భవన్ఎదుట బారికేడ్లను ఢీకొట్టింది.
కారులో సోహైల్తో పాటు ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు ఉన్నట్లు పంజాగుట్ట పోలీసులు గుర్తించారు. కేసు నుంచి సోహైల్ను తప్పించడానికి అతడి ఇంట్లో పనిచేసే అబ్దుల్ ఆసిఫ్ను నిందితుడిగా చేర్చే ప్రయత్నం చేశారు. యాక్సిడెంట్ తర్వాత సోహైల్ను బ్రీత్ ఎనలైజ్టెస్ట్ కోసం స్టేషన్కు తీసుకెళ్లారు. కానీ సోహైల్ అక్కడి నుంచి బయటకొచ్చి దుబాయ్ పారిపోయాడు. కేసును తప్పుదోవ పట్టించడంపై హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి సీరియస్ అయ్యారు. పంజాగుట్ట సీఐ దుర్గారావును సస్పెండ్ చేశారు.
సీఐ దుర్గారావుతో డీల్ కుదిర్చింది సీఐ ప్రేమ్ కుమార్ అని దర్యాప్తులో తేలడంతో తాజాగా ఆయనను అరెస్ట్ చేశారు. డీల్ కోసం డబ్బు సర్దుబాటు చేసిన అబ్దుల్ వాసేను కూడా అదుపులోకి తీసుకున్నారు. సోహైల్పై ఇదివరకే లుక్ ఔట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు నిందితుడిని తప్పించినందుకు షకీల్పైనా కేసు పెట్టారు. అయితే, దుబాయ్లో ఉన్న షకీల్ ఈ వారంలో వచ్చి పోలీసుల ముందు లొంగిపోనున్నట్లు తెలిసింది.
బీఆర్ఎస్తో అంటకాగి..
2009 ఎస్ఐ బ్యాచ్కు చెందిన ప్రేమ్కుమార్ ప్రమోషన్ తర్వాత 2021 అక్టోబర్25న బోధన్ టౌన్ సీఐగా వచ్చారు. అప్పటి రూలింగ్ పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ రెకమెండేషన్తో ఆయన పోస్టింగ్ పొందారని, అందుకే పూర్తిగా ఆయన అదుపాజ్ఞల్లో పని చేశారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. జులై 2023లో షకీల్పై హత్యాయత్నం చేశారంటూ మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మ భర్త, కౌన్సిలర్ శరత్రెడ్డితో పాటు మరో కౌన్సిలర్ మీర్నజీర్అలీ, ఎంఐఎం లీడర్లు నవీద్, అల్తాఫ్, సమీర్పై ప్రేమ్కుమార్ కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎడపల్లి మండలంలో కాంగ్రెస్లీడర్లపై ఆయన లాఠీచార్జ్ చేయడం దుమారం రేపింది. ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ ఓడిపోగా, కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గెలిచారు. ఆ తర్వాత డిసెంబర్ 5 నుంచి ప్రేమ్ కుమార్ లీవ్లో వెళ్లిపోయారు. లీవ్ కంప్లీట్ అయ్యాక తిరిగి విధుల్లో చేరిన ఆయనను నిజామాబాద్ సీసీఎస్కు ఎటాచ్ చేశారు. ఆయనను సీసీఎస్లో సీఐగా పూర్తి స్థాయి ట్రాన్స్ ఫర్ చేస్తూ శనివారం సాయంత్రం ఆర్డర్స్ వచ్చాయి. సోమవారం బాధ్యతలు తీసుకోవడానికి ఆయన సిద్ధం కాగా, ఆదివారమే హైదరాబాద్లో అరెస్ట్ అయ్యారు.