రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా భోగి సంబురాలు

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా భోగి సంబురాలు

దేశవ్యాప్తంగా సంక్రాంతి సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. గోవాలోని రాజ్ భవన్ లో భోగి మంటలు వేశారు వెంకయ్య. దేశప్రజలందరికి పండుగ శుభాకాంక్షలు చెప్పారు. అంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా భోగి సంబురాలు కొనసాగుతున్నాయి. భోగి మంటలు వేసి సంక్రాంతి స్వాగతం పలుకుతున్నారు జనం. ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ లో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రి పువ్వాడ అజయ్ సతీమణి వసంత లక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై భోగి మంటలు వేశారు.

పెద్దపల్లి జిల్లాలో భోగి సందడి మొదలైంది. భోగిమంటలతో సంకాంత్రి పండుగకు స్వాగతం పలికారు ప్రజలు. భోగి మంటల చుట్టూ ఉత్సాహంగా డ్యాన్సులు చేశారు మహిళలు.  గోదావరి మార్కండేయ కాలనీలో.. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో  వేడుకలు నిర్వహించారు. భోగి మంటలు వేసి.. శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. భోగిని పురస్కరించుకుని తెల్లవారు జామునుంచే భోగి మంటలు వేశారు. స్నానాలు చేసి, కొత్త బట్టలు వేసుకుని గంగిరెద్దులకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. సంక్రాంతి వేడుకల్లో కుటుంబంతో కలిసి పాల్గొన్నారు ఏపీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. తెలుగు రాష్ట్రాల ప్రజలకు పండుగ శుభాకాంక్షలు చెప్పిన ఆయన… ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు.