పట్నా: రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్ మ్యాచ్లో బిహార్ మీడియం పేసర్ అభిజిత్ సాకేత్.. మ్యాజిక్ స్పెల్తో అదరగొట్టాడు. ఒక్క పరుగు కూడా ఇవ్వకుండానే ఏడు వికెట్లు తీసి అదరహో అనిపించాడు. దీంతో మిజోరంతో మూడు రోజుల్లోనే ముగిసిన మ్యాచ్లో బిహార్ 6 వికెట్లతో గెలిచింది. ఆదివారం బ్యాటింగ్కు దిగిన మిజోరం రెండో ఇన్నింగ్స్లో 31.4 ఓవర్లలో 68 పరుగులకే కుప్పకూలింది. ఫస్ట్ ఓవర్లోనే లాల్రిన్సింగా (0)ను ఔట్ చేసిన సాకేత్.. తన రెండో ఓవర్లో తరువార్ కోహ్లీ (0)ని, ఆ తర్వాత వరుసపెట్టి లాల్హ్రుజెల్లా (1), లాల్మంగైహ (3), లాల్రుటాడికా (0), ప్రతీక్ దేశాయ్ (0), లాల్బియాక్వెలా (0)ను పెవిలియన్కు చేర్చి అరుదైన ఫీట్ను సొంతం చేసుకున్నాడు. వీళ్లను ఔట్ చేసే క్రమంలో ఒక్క రన్ కూడా ఇవ్వకపోవడం గమనార్హం. ఓవరాల్గా ఈ ఇన్నింగ్స్లో 10 ఓవర్లు వేసిన సాకేత్.. 6 మెయిడెన్లు 12 పరుగులు ఇచ్చాడు. దీంతో కెరీర్ బెస్ట్ (7/12) స్టాట్స్ను అందుకున్నాడు. అషుతోష్ అమన్ (2/30), శివమ్ కుమార్ (1/12) తర్వాతి మూడు వికెట్లు తీయడంతో మిజోరం.. బిహార్ ముందు 185 రన్స్ టార్గెట్ను ఉంచింది. దీనిని బిహార్ 32.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 188 రన్స్ చేసి ఛేదించింది. ఇంద్రజిత్ కుమార్ (98 నాటౌట్), బాబుల్ కుమార్ (61) రాణించారు

