పల్నాడులో కొనసాగుతున్న ఉద్రిక్తత.... కర్ఫ్యూ వాతావరణం

పల్నాడులో కొనసాగుతున్న ఉద్రిక్తత....  కర్ఫ్యూ వాతావరణం

ఏపీలో ఎన్నికల వేడి కొనసాగుతూనే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తలు చోటుచేసుకుంటున్నాయి. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించినప్పటికీ అల్లర్లు చెలరేగుతునే ఉన్నాయి. ఈ క్రమంలోనే పల్నాడు(Palnadu) ఏరియాలో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. . మాచర్ల, నర్సరావుపేటలో గొడవలు జరిగే అవకాశం ఉందనే సమాచారంతో మాచర్ల, గురజాల, నర్సరావుపేటల్లో 144 సెక్షన్ విధించారు.  ముందుగానే షాపులన్నీ మూసేయించిన పోలీసులు.. ఇప్పటికే నర్సరావుపేటలో 62 మంది అరెస్ట్‌ చేశారు. అలాగే కారంపూడిలో దాడుల వీడియోల ఆధారంగా గొడవలకు పాల్పడిన వారిని గుర్తించే పనిలో ఉన్నట్లు తెలిపారు.

తాడిపత్రిలోనూ ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. తాడేపల్లి నియోజకంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో తాడిపత్రి పట్టణంలోనూ 144 సెక్షన్‌ విధించారు. మరోవైపు.. కడప, జమ్మలమడుగులోనూ 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు పోలీసులు. అభ్యర్థులు, కీలక నేలను ఇళ్లకే పరిమితం చేశారు. జమ్మలమడుగులో వైసీపీ, టీడీపీ, బీజేపీ పార్టీ ఆఫీసుల దగ్గర భారీగా పోలీసుల బలగాలు మోహరించాయి. అభ్యర్థుల ఇంటి దగ్గర కూడా… భద్రత పెంచారు. ఇక, 144 సెక్షన్‌ అమల్లో ఉన్న చోట… గుంపులుగా బయట తిరగకూడదు. రెచ్చగొట్టేలా కవ్వింపు చర్యలకు పాల్పడకూడదు. సభలు, సమావేశాలు పెట్టకూడదు. నిబంధనలు మీరితే… కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచర్చించారు.

 ఏపీలో పోలింగ్‌ తర్వాత జరుగుతున్న హింసపై… సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలింగ్‌ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఘర్షణలు జరిగాయి.  తిరుపతి, మాచర్ల, అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాలో గొడవలు జరిగాయి. ఇప్పటికీ  ( వార్త రాసే సమయానికి) అదుపులోకి రాలేదు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్‌ అమల్లో ఉంది. సత్తెనపల్లి, మాచర్ల, పిడుగురాళ్లలో షాపులు కూడా మూయించారు పోలీసులు. నర్సరావుపేటలోనూ పోలింగ్‌ రోజున…. టీడీపీ అభ్యర్థి కాన్వాయ్‌పై దాడులు జరిగాయి. నర్సరావుపేటలో ఎమ్మెల్యే ఇంటిపైనా ప్రతిదాడికి దిగారు ప్రత్యర్థులు. ఏపీలో పోలింగ్‌ రోజున మొదలైన గొడవలు… హింసాత్మకంగా మారుతుండటంతో… కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకుంది. 

పల్నాడు జిల్లాలోని మాచర్లతో పాటు పలు నియోజకవర్గాల్లో నెలకొన్న పరిస్థితులపై అధికారులు ఎన్నికల సంఘానికి నివేదిక ఇచ్చారు. దీంతో జిల్లాలో నిషేదాజ్ఞలు అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వైసీపీతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేల అనుచరులు టీడీపీ నేతల్ని టార్గెట్‌గా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారని టీడీపీ అధ్యక్షుడు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.పల్నాడు గొడవలపై డీజీపీతో పాటు గవర్నర్ లేఖలు రాశారు. పల్నాడులో శాంతి భద్రతల పరిస్థితిపై గవర్నర్కు టీడీపీ అధినేత చంద్రబాబు ఫిర్యాదు చేశారు. మాచర్లలో మరోసారి దాడులు జరిగే అవకాశం ఉందనే సమాచారంతో అలెర్టైన పోలీసులు నిషేదాజ్ఞలు విధించారు.

ఈసీ ఆదేశాలతో పారామిలటరీ బలగాలను పల్నాడుకు జిల్లాకు డీజీపీ పంపారు. మాచర్ల పట్టణంతో పాటు, గ్రామాల్లో పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. దాదాపు వెయ్యిమంది అదనపు బలగాలను పల్నాడు జిల్లాకు తరలించారు. టీడీపీ సానుభూతిపరుల ఇళ్లు, వ్యాపార దుకాణాలపై దాడులు చేశారని ఆ పార్టీ ఆరోపిస్తోంది.

తిరుపతిలో ఉద్రిక్తత…

అటు తిరుపతిలో కూడా ఉద్రిక్తత కొనసాగుతోంది.  చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం జరిగింది. పులివర్తి నాని వాహనాలపై భారీ సుత్తులు, గొడ్డళ్లతో దాడులకు పాల్పడ్డారు. నిందితులను అరెస్ట్ చేయని పోలీసులు బాధితులపైనే కేసుపెట్టారిన ఆరోపిస్తూ పులివర్తి నాని భార్య ఆందోళనకు దిగారు. తిరుచానూరు పీఎస్ ముందు పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి ధర్నాకు దిగారు.

అనంతపురంలో అలజడి….

అనంతపురంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అర్థరాత్రి జేసీ నివాసంలో పోలీసులు తనిఖీ చేపట్టారు. జేసీ అనుచరులపై దాడి చేసిన అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల దాడులను జేసీ దివాకర్ రెడ్డి ఖండించారు. తమ ఇంట్లో ఇద్దరు పేషెంట్లు ఉన్నారని, ఇద్దరూ మంచంపై లేవలేని స్థితిలో ఉన్నారని వారికి మందులు ఇచ్చేందుకు కూడా ఎవ్వరు లేరన్నారు. పని మనుషులను కూడా పోలీసులు తీసుకెళ్లిపోయారని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆరోపించారు.