కమెడియన్‌గా, విలన్‌గా ఏకకాలంలో చక్రం తిప్పిన నటుడు

కమెడియన్‌గా, విలన్‌గా ఏకకాలంలో చక్రం తిప్పిన నటుడు

కడుపుబ్బ నవ్వించగలడు. కళ్లనిండా నీరు తెప్పించగలడు. సౌమ్యంగా మనసును స్పృశించగలడు. క్రూరంగా కంగారుపెట్టనూ గలడు. ఎంత పెద్ద పాత్రనైనా అవలీలగా పండించగలడు. ఎంత చిన్న పాత్రకైనా తన నటనా పటిమతో కొండంత గౌరవాన్ని తెచ్చిపెట్టగలడు. ఆ మేటి నటుడు ఎవరో కాదు.. కోట శ్రీనివాసరావు. ఇవాళ ఆయన పుట్టినరోజు.  ఈ సందర్భంగా కోట గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు...

కోట శ్రీనివాసరావుది కృష్ణాజిల్లా, గుడివాడ పక్కన బేతవోలు. వాళ్ల తాతగారు టీచర్. తండ్రి డాక్టర్. ఆయన మెడికల్ ప్రాక్టీస్ కోసం ఫ్యామిలీ కంకిపాడులో సెటిలయ్యింది. నాన్న కోరిక మేరకు తానూ డాక్టర్ అవ్వాలనుకున్నారు కోట. కానీ వేరే కారణాల వల్ల డిగ్రీ చేయాల్సి వచ్చింది. బ్యాచ్‌లర్ డిగ్రీ పూర్తయ్యాక స్టేట్‌బ్యాంక్‌లో ఉద్యోగం వచ్చింది.

 చిన్నప్పటి నుంచి అన్నయ్యతో కలిసి నాటకాలు చూస్తుండేవారు. అలా మనసు నటన మీదికి పోయింది. పదో తరగతిలో ఉన్నప్పుడే ‘ఆడది’ అనే నాటకంలో యాక్ట్ చేశారు. ప్రీ యూనివర్శిటీలోనూ కొన్ని నాటకాల్లో నటించారు. ఆ తర్వాత జాబ్ చేస్తూనే నాటకాలు వేస్తుండేవారు. ‘మళ్లీ పాత పాటే’ అనే నాటకం ఆయనకు చాలా పేరు తెచ్చిపెట్టింది. ఈ నాటకాన్ని దాదాపు నూట పాతికసార్లు ప్రదర్శించారు కోట.

‘ప్రాణం ఖరీదు’ నాటకంలో యాక్ట్ చేస్తుండేవారు కోట. ఓసారి ఆ నాటకం వేసినప్పుడు దర్శక నిర్మాత క్రాంతి కుమార్‌‌ చూడటానికి వచ్చారు. ఆయనకి ఆ డ్రామా బాగా నచ్చేసి ఆ కథతో సినిమా తీయాలని నిర్ణయించుకున్నారు. ఆ నాటకంలో యాక్ట్ చేసినవారందరికీ గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో సినిమాలోకి కూడా తీసుకున్నారు. అలా కోట ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. 

అవకాశాలు పెరిగాక ఇరవయ్యేళ్ల పాటు చేసిన బ్యాంక్ ఉద్యోగానికి రాజీనామా చేసేశారు కోట. ఎంత బిజీ అయిపోయారంటే.. మద్రాసును వదిలి రావడానికే వీలయ్యేది కాదు. దాంతో ఓ హోటల్లో రూమ్‌ తీసుకున్నారు. తెల్లవారుజామునే షూటింగుకు వెళ్లిపోయేవారు. మళ్లీ రాత్రికి తిరిగొచ్చి ఏదో ఒకటి తిని పడుకునేవారు. అలా ఐదున్నర నెలల పాటు హోటల్లోనే ఉండిపోయారు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఫ్యామిలీని మద్రాస్ షిఫ్ట్ చేశారు.

ఎలాంటి పాత్రనైనా పండించగలడనే పేరు రావడంతో కోట కెరీర్‌ ఒక సమయంలో‌ పీక్స్ కు  వెళ్లింది. ఆయన లేని సినిమా అంటూ ఉండేది కాదు. ఒక్కోసారి ఉదయం చెన్నైలో, మధ్యాహ్నం హైదరాబాద్‌లో, సాయంత్రం కర్ణాటకలో షూటింగ్‌లో పాల్గొనాల్సి వచ్చేది. అలా మూడు రాష్ట్రాల మధ్య తిరుగుతూ ఉండేవాడినని, టైమ్ లేక ఎయిర్‌‌పోర్ట్లోనే స్నానం చేసేసేవాడినని ఓ సందర్భంలో స్వయంగా చెప్పారు కోట. ‘ప్రతిఘటన’ సినిమాలోని పాత్ర కోటకి చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక ‘అహనా పెళ్లంట’ చేసిన పిసినారి పాత్రయితే ఆయన్ని ఎక్కడికో తీసుకుపోయింది. కమెడియన్‌గా, విలన్‌గా కూడా ఏకకాలంలో చక్రం తిప్పిన నటుడు కోట. 

‘మండలాధీశుడు’ సినిమా కోట కెరీర్‌‌ని పెద్ద దెబ్బే కొట్టింది. అందులో ఎన్టీఆర్‌‌ని పోలిన పాత్ర చేశారాయన. అది కాస్త నెగిటివ్‌గా అనిపించడంతో అభిమానులు సీరియస్‌ అయ్యారు. ఎన్టీఆర్‌‌ని ఇష్టపడే నిర్మాతలు కోటకి అవకాశాలు ఇవ్వడం మానేశారు. ఆ సమయంలో దాదాపు ఏడాదిన్నర పాటు చాలా కష్టపడ్డారు కోట. బయట కనబడితే జనాలు కొడతారేమోనని భయపడ్డానంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పారాయన. ఆ తర్వాత మెల్లగా పరిస్థితులు చక్కబడ్డాయి. కోట మళ్లీ పుంజుకున్నారు.

కెరీర్‌‌లో ఇప్పటి వరకు ఆరొందల యాభైకి పైగా సినిమాల్లో నటించారు కోట. తెలుగుతో పాటు తమిళంలోనూ అడపా దడపా నటిస్తుండేవారు. మలయాళంలో ఒక సినిమా, కన్నడలో నాలుగు సినిమాలు చేశారు. హిందీలో పది చిత్రాల వరకు చేశారు. ‘సర్కార్‌‌’ సినిమాలో అమితాబ్‌తో నటిస్తున్నందుకు చాలా సంతోష పడ్డారు కోట. వాళ్లిద్దరూ మొదట షూట్ స్టార్ట్ చేస్తే, అభిషేక్ బచ్చన్ తర్వాత వచ్చి జాయినయ్యాడట. అప్పుడు అమితాబ్ కొడుకుని పిలిచి.. ‘ఈయన కోట శ్రీనివాసరావు. చాలా గొప్ప ఆర్టిస్ట్. ఇలాంటి వారితో యాక్ట్ చేయడం నీ అదృష్టం’ అని చెప్పారట.  

బిజీగా ఉండటంతో డేట్లు సర్దుబాటు చేయలేక చాలా అవకాశాలు వదిలేయాల్సి వచ్చేది. ఉదాహరణకి ‘ఆ ఒక్కటీ అడక్కు’లో రావు గోపాలరావు చేసిన మామగారి పాత్ర కోట చేయాల్సి ఉంది. కానీ అప్పటికి ఆయన చాలా బిజీగా ఉన్నారు. కాల్షీట్లు కుదరడం లేదు. అయినా కూడా ఎలాగైనా కోటతోనే ఆ క్యారెక్టర్ చేయించాలని ఎదురు చూశారు ఈవీవీ. ఇక అవకాశం లేదని తెలిశాక రావు గోపాలరావుని తీసుకున్నారు. ఈవీవీతో చెవిలో పువ్వు, హలో బ్రదర్, ఆమె, మా నాన్నకి పెళ్లి, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు లాంటి సినిమాలు చేశారు కోట. తనలోని జీల్‌ని బైటికి తెచ్చిన దర్శకుడు ఈవీవీయేనని ఇప్పటికీ చెబుతుంటారు. 

కోట, బాబూ మోహన్‌లది హిట్ కాంబినేషన్. ఇద్దరూ కలిసి నటిస్తే ఆ సినిమా హిట్టు అన్నంతగా క్లిక్ అయిన కాంబో ఇది. నిజానికి మొదట వీళ్లిద్దరినీ కలిపింది ముత్యల సుబ్బయ్య. ‘మామగారు’ మూవీలో వీళ్లిద్దరినీ కలిపి ఒక ట్రాక్ పెట్టారాయన. సినిమా సక్సెస్ కావడానికి ఆ రెండు పాత్రలూ కూడా కారణం కావడంతో..  అప్పటి నుంచి వీళ్లిద్దరినీ కలిపే కథలు రాసుకునేవారు దర్శకులు. యాభై సినిమాల్లో అలా కలిసి నటించడంతో బైట కూడా ఆత్మీయులుగా మారిపోయారు కోట, బాబూ మోహన్.

కోటకి మిమిక్రీ చేయడం బాగా తెలుసు. ‘టైమ్‌పాస్‌’ పేరుతో ఓ క్యాసెట్ కూడా రిలీజ్ చేశారు. నలభై అయిదు నిమిషాల పాటు ఉండే ఆ ఆడియోలో తెలంగాణ యాసలో రామాయణంతో పాటు పాండవ వనవాసం, బొబ్బిలి బ్రహ్మన్న సినిమాల్ని చెప్పారు. ఆ సినిమాలు చూసొచ్చిన వ్యక్తి వాటి గురించి ఎలా చెబుతాడనేది థీమ్. అప్పట్లో ఇది సూపర్ హిట్టయ్యింది.

కోట అద్భుతమైన నటనకు బోలెడన్ని పురస్కారాలు వరించాయి. తొమ్మిదిసార్లు నంది అవార్డు తీసుకున్నారాయన. ‘కృష్ణం వందే జగద్గురుం’ సినిమాకి సైమా అవార్డు తీసుకున్నారు. అల్లు రామలింగయ్య అవార్డును కూడా అందుకున్నారు. భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో ఆయన్ని సత్కరించింది. రాజకీయాల్లోనూ రాణించారు కోట. విజయవాడ తూర్పు శాసనసభా నియోజకవర్గం నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

కెరీర్ పరంగా ఊహించనని విజయాలు చూసిన కోట.. వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. వయసొచ్చిన కూతురికి యాక్సిడెంట్ అయ్యి కాలు తీసేసినప్పుడు కోట, ఆయన భార్య రుక్మిణి చాలా కుమిలిపోయారు. ఆ అమ్మాయికి ఓ మంచి అబ్బాయితో పెళ్లి చేశాక గానీ వారి మనసులు కుదుటపడలేదు. అయితే అంతా సర్దుకుంటోంది అనుకున్న సమయంలో మరో షాక్. కొడుకు యాక్సిడెంట్‌లో చనిపోయాడు. ఆ తర్వాత పూర్తిగా కుంగిపోయారు కోట. నటించడం కూడా తగ్గించేశారు.

ఇండస్ట్రీలో నటీనటులు చాలామంది ఉంటారు. అయితే అందరూ ఆల్‌ రౌండర్స్ కాలేరు. ఎవరో కోట లాంటి వారు తప్ప. అలాంటి వారిని ప్రేక్షకులు తమ గుండెల్లో నిలుపుకుంటారు. అలా కొన్ని కోట్లమంది సినీ ప్రియుల హృదయాల్లో కోట కట్టుకున్న ఆయన మరిన్నిసంవత్సరాలు ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని కోరుకుంటూ.. కోట శ్రీనివాసరావుకి పుట్టినరోజు శుభాకాంక్షలు.