ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

కరీంనగర్ టౌన్, వెలుగు: బీజేసీ, కాంగ్రెస్ నాయకులు గురువారం నగరంలోని తెలంగాణ చౌక్ లో పోటాపోటీ నిరసనలు చేపట్టారు. ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ కు చేసిన అభివృద్ధిపై బహిరంగ సభలో జవాబు చెప్పాలని ప్రశ్నలతో కూడిన ఫ్లెక్సీని ప్రదర్శించారు. తీగలగుట్టపల్లి వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జికి కేంద్రం నుంచి నిధులు ఎందుకు మంజూరు చేయలేదని, అది బీజేపీ అసమర్థత కాదా అని ప్రశ్నించారు. 4 ఏండ్లలో కరీంనగర్ యువతకు ఎంపీ ఏం చేశారని, నగరంలో కొనసాగుతున్న స్మార్ట్ సిటీ పనుల్లో క్వాలిటీ లేకున్నా ఎందుకు పట్టించకోవడంలేదని మండిపడ్డారు. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు ఘటనా స్థలానికి చేరుకుని కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒక దశలో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సిటీ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, బీజేపి మైనార్టీ మోర్చా నాయకులు పాల్గొన్నారు. 

అనర్హులకు ఇండ్లు కేటాయిస్తారా?

గ్రామసభలో అధికారులపై గ్రామస్తుల ఆగ్రహం

తిమ్మాపూర్, వెలుగు : కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం గతంలో అధికారులు ఎంపిక చేసిన పేర్లపై పలువురు గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇటీవల అలుగునూర్ గ్రామ పంచాయతీగా ఉన్నపుడు గ్రామసభ నిర్వహించి అర్హుల లిస్టును అధికారులు ఎంపిక చేశారు. గురువారం అలుగునూర్ మున్సిపల్ ఆఫీస్​లో నిర్వహించిన గ్రామసభలో తహసీల్దార్ కనకయ్య అప్పటి అర్హుల పేర్లను చదివి వినిపించారు. దీంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనర్హుల పేర్లు లిస్టులో ఉన్నాయంటూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన తహసీల్దార్ కనకయ్య అభ్యంతరాలను లిఖిత పూర్వకంగా అందజేస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఎస్. శారద, సొసైటీ చైర్మన్ స్వామి రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.

పెంచిన వేతనాలు అమలు చేయాలి 

సివిల్ సప్లై హమాలీ కార్మికులు 

తిమ్మాపూర్, వెలుగు: సివిల్ సప్లై గోదాంలలో పనిచేస్తున్న తమకు పెంచిన వేతనాలు అమలయ్యేలా జీఓ విడుదల చేయాలని సివిల్ సప్లై హమాలీ కార్మికులు డిమాండ్ చేశారు. గురువారం కరీంనగర్ కార్పొరేషన్ పరిధి అలుగునూరు శివారులోని సివిల్ సప్లై గోదాం వద్ద హమాలీ కార్మికులు 2 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి టేకుమల్ల సమ్మయ మాట్లాడుతూ కార్పొరేషన్ హమాలీ స్వీపర్ కార్మికులకు గతేడాది డిసెంబర్ 31తో ఒప్పందం ముగిసిందన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి నూతన ఒప్పందం అమల్లోకి రావలసి ఉన్నప్పటికీ ప్రభుత్వం రేట్లు పెంచకుండా నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. కార్పొరేషన్ రాష్ట్ర కమిషనర్ సమక్షంలో చర్చలు జరిపి ఒప్పందం చేసుకుని నాలుగు నెలలు గడుస్తున్నా నేటికీ జీఓ విడుదల చేయకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా లీడర్లు కమథం శ్రీధర్, పొన్నాల మహేశ్, బండారి మురళి, లక్ష్మయ్య. పొన్నాల రాజయ్య, ఐలయ్య, కార్మికులు పాల్గొన్నారు. 

బీజేపీలోకి సెస్ మాజీ చైర్మన్ 

చందుర్తి, వెలుగు: సెస్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ లీడర్​అల్లాడి రమేశ్​గురువారం ఎంపీ బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. కరీంనగర్ లో జరుగుతున్న ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, సీనియర్ లీడర్లు​మహేశ్, బాలరాజు ఆధ్వర్యంలో రమేశ్​బీజేపీ కండువా కప్పుకున్నారు. బుధవారం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన రమేశ్​గురువారం బీజేపీ లో చేరడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఈసారి ఎలాగైనా సెస్  చైర్మన్ పదవిని సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో రమేశ్​తన భార్య అల్లాడి నళినిని వేములవాడ టౌన్ నుంచి, తమ్ముడు అల్లాడి కృష్ణను రుద్రంగి డైరెక్టర్ స్థానం నుంచి బరిలోకి దింపుతున్నారు. 

రైతులకు అండగా బీఆర్ఎస్ 

రాజన్న సిరిసిల్ల, వెలుగు : రైతులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని, 24 గంటలు కరెంట్ అందిస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమే అని ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్ అన్నారు. గురువారం సిరిసిల్లలోని కేటీఆర్ క్యాంప్ ఆఫీస్​లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. రైతులకు, బీఆర్ఎస్ కు వీడదీయలేని బంధం ఉందన్నారు. ఎనిమిదేండ్ల కిందట కరెంట్ లేక ఎన్నో ఇబ్బందులు పడ్డామని, ఇప్పుడు పరిస్థితి మారిందన్నారు. ప్రస్తుతం 24గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. మోటార్లకు మీటర్లు పెట్టే నాయకులవైపు ఉంటారో రైతులను కాపాడుకునే కేసీఆర్ వైపు ఉంటారో రైతులు ఆలోచించుకోవాలన్నారు. సిరిసిల్లలో చేనేత కార్మికులు ఆకలి చావులు లేవని, ఎడారి ప్రాంతంగా ఉన్న సిరిసిల్లకు మానేరు నీళ్లు తెచ్చి సస్యశ్యామలంగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ దే అని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ నాయకత్వంలో సిరిసిల్లలో 15 డైరెక్టర్ స్థానాలు గెలిచి సెస్ పై గులాబీ జెండా ఎగరేస్తామన్నారు. సమావేశంలో  టెస్కాబ్ చైర్మన్ రవీందర్ రావు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆగయ్య,  గుడూరి ప్రవీణ్, లీడర్లు పాల్గొన్నారు. 

పారిశుధ్య కార్మికులను నియమించాలని వినతి

గోదావరిఖని, వెలుగు: రామగుండం కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌ పరిధిలోని 50 డివిజన్లలోని గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌ స్కూళ్లలో పారిశుధ్య కార్మికులను నియమించాలని పీఆర్‌‌‌‌‌‌‌‌టీయూ స్టేట్ అసోసియేట్‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ ఆకుల రాజన్న కోరారు. గురువారం రామగుండం కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌ సుమన్‌‌‌‌‌‌‌‌రావుకు ఆయన వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్‌‌‌‌‌‌‌‌ ప్రకారం పారిశుధ్య సిబ్బంది రోజూ స్కూల్‌‌‌‌‌‌‌‌ రిజిస్టర్‌‌‌‌‌‌‌‌లో సంతకం చేయాలని ఉన్నా కార్మికులను ఎంఉదకు నియమించడం లేదని ప్రశ్నించారు. స్కూళ్లలో చెత్త తొలగించకపోవడంతో దుర్గంధం పెరిగి దోమలతో విద్యార్థులు రోగాలబారిన పడుతున్నారన్నారు.

‘కామర్స్ తో ఉజ్వల భవిష్యత్’

కోరుట్ల, వెలుగు: కామర్స్ స్టూడెంట్స్ కు ఉజ్వల భవిష్యత్ ఉందని శాతవాహన యూనివర్సిటీ కామర్స్ డిపార్ట్​మెంట్ హెడ్ డాక్టర్​డి.హరికాంత్ అన్నారు. గురువారం కోరుట్ల ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పూర్వ విద్యార్థుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ కామర్స్ స్టూడెంట్స్ కు టాలెంట్ టెస్ట్ , వర్క్ షాప్ నిర్వహించారు. కార్యక్రమంలో 10 కాలేజీల నుంచి 289 మంది స్టూడెంట్లు పాల్గొన్నారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు హరికాంత్ నగదు పారితోషికంతోపాటు మెమోంటో ప్రదానం చేశారు. కార్యక్రమంలో కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీ కామర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సతీశ్​కుమార్, ప్రిన్సిపాల్ వాసవి, పూర్వ విద్యార్థుల సంఘం ప్రెసిడెంట్ విశ్వనాథం, కామర్స్ డిపార్ట్​మెంట్ హెడ్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.