
కరీంనగర్ : తనకు జైళ్లు కొత్త కాదని, టీఎస్పీఎస్సీ లీకేజీలో ప్రభుత్వ తప్పిదాలను ఐటీశాఖ మంత్రిగా ఉన్న కేసీఆర్ కొడుకు పాత్రను ఎత్తి చూపినందుకే తనను అరెస్టు చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి సంజయ్ ఇవాళ ఒక లేఖ విడుదల చేశారు. కేసీఆర్ సర్కార్ ను బొందపెట్టడమే తమ లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ కొడుకును కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసే వరకు.. నిరుద్యోగులకు రూ.లక్ష పరిహారం ఇచ్చేవరకు పోరాడాలని కోరారు.
తనకు కేసులు, అరెస్టులు, కొత్త కాదని.. ప్రజల కోసం ఎన్నిసార్లైనా జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని బండి సంజయ్ తెలిపారు. తన బాధంతా నిరుద్యోగుల భవిష్యత్ పైనేనని చెప్పారు. 30 లక్షల నిరుద్యోగుల జీవితాలతో, వాళ్ల కుటుంబాలతో కేసీఆర్ ప్రభుత్వం చెలగాటమాడుతోందన్నారు. నాడు ఇంటర్ విద్యార్థులను 27 మందిని బలితీసుకున్న ఈ సర్కారు.. ప్రస్తుతం టెన్త్ విద్యార్థుల జీవితాలతోనూ చెలగాటమాడుతోందని విమర్శించారు. ఇప్పటికే కేసీఆర్ పాలనలో రైతులు, మహిళలు, విద్యార్థులు సహా సబ్బండ వర్గాలు అనేక కష్టాలను అనుభవిస్తున్నాయని... వాళ్లందరికీ బీజేపీ ఆశా దీపమైందని తెలిపారు. వాళ్ల ఆశలను నెరవేర్చాలంటే పోరాటమే శరణ్యం’ అని లేఖలో సంజయ్ పేర్కొన్నారు.