కాంగ్రెస్ ఎంపీ అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బీజేపీ నిరసన

కాంగ్రెస్ ఎంపీ అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బీజేపీ నిరసన

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బీజేపీ దేశవ్యాప్త నిరసన కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగా హైదరాబాద్ బర్కత్ పురా చౌరస్తాలో బిజెపి హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు గౌతమ్ రావు ఆధ్వర్యంలో సోనియా గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఎస్టి మహిళ రాష్ట్రపతి పీఠం ఎక్కడాన్ని కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతుందని గౌతమ్ రావు మండిపడ్డారు. రాష్ట్రపతిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు సోనియా గాంధీ , కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ క్షమాపణ చెప్పాలని బీజేపీ నేతలు, నాయకులు డిమాండ్ చేశారు.

రాష్ట్రపతిని కాంగ్రెస్ అవమానించింది..
రాష్ట్రపతి ద్రౌప‌ది ముర్ముపై ఎంపీ అధిర్ రంజ‌న్ చౌద‌రి చేసిన కామెంట్లపై పార్లమెంటులో తీవ్ర దుమారం రేగింది.  ఎంపీ అధిర్ రంజన్ బహిరంగ క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, నిర్మలా సీతారామణ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతిని తీవ్రంగా అవమానించిందని మండిపడ్డారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు స్వయంగా వారి పార్టీ నేత అలా మాట్లాడటానికి అనుమతించార‌ని... అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న దేశ తొలి మహిళా గిరిజన అధ్యక్షురాలిని అవమానించినందుకు సోనియా గాంధీ దేశానికి, గిరిజనులకు క్షమాపణ చెప్పాలని అన్నారు.  ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీ ఆమెను తీవ్రంగా అవమానిస్తోందని వారు ఆరోపించారు. 

అధిర్ క్షమాపణ చెప్పాల్సిందే...
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీ ఈడీ విచారణ, జీఎస్టీ విషయంలో కేంద్రం వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ ఎంపీలు బుధవారం నిరసన చేపట్టారు. పార్లమెంటు నుంచి విజయ్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడి నుంచి రాష్ట్రపతి భవన్కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి వద్దకు వచ్చిన ఓ జర్నలిస్టు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారని ప్రశ్నించగా.. రాష్ట్రపత్ని భవనానికి అని నోరు జారారు. ఈ వ్యాఖ్యలు కాస్తా మీడియాలో ప్రసారం కావడం దుమారానికి కారణమైంది. అధిర్ రంజన్ మాటలపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తోంది. 

సారీ చెప్పను..
రాష్ట్రపతిపై చేసిన తాను చేసిన వ్యాఖ్యలపై అధిర్ రంజన్ చౌదరి వివరణ ఇచ్చారు. పొరపాటున రాష్ట్రపత్ని అన్నానని సంజాయిషీ ఇచ్చే ప్రయత్నం చేశారు. దాన్ని బీజేపీ అస్త్రంగా వాడుకుంటోందని మండిపడ్డారు. రాష్ట్రపతిగా అత్యున్నత పదవిలో ఉన్నవాళ్లెవరైనా వారి కులంతో సంబంధం లేదని చెప్పారు. ప్రజా సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు బీజేపీ అనవసర రాద్దాంతం చేస్తోందని మండిపడ్డారు. పొరపాటున అన్న పదాన్ని వివాదాస్పదం చేయడం సరికాదని, తాను క్షమాపణ చెప్పే ప్రసక్తేలేదని అధిర్ రంజన్ చౌదరి స్పష్టం చేశారు.