‘సచిన్-సెహ్వాగ్‌‌లా బీజేపీ-జేడీ(యూ) జోడీ సూపర్ హిట్’

‘సచిన్-సెహ్వాగ్‌‌లా బీజేపీ-జేడీ(యూ) జోడీ సూపర్ హిట్’

న్యూఢిల్లీ: బిహార్‌‌లో ఎన్నికల ప్రచార హోరు వేడెక్కుతోంది. అధికార, విపక్షాలు ఒకదానిపై మరొకటి మాటల దాడికి దిగుతున్నాయి. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌‌నాథ్ సింగ్ కూడా ప్రచార బరిలోకి దిగారు. బిహార్‌‌లోని భగల్‌‌పూర్‌‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ-జేడీ (యూ) పొత్తుపై పలు వ్యాఖ్యలు చేశారు. క్రికెట్‌‌లో సచిన్ టెండూల్కర్-వీరేంద్ర సెహ్వాగ్ జోడీలా బీజేపీ-జేడీయూ పొత్తు సూపర్ హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నితీశ్ కుమార్ సీఎంగా ఉంటే ప్రభుత్వంలో అవినీతికి ఎలాంటి ఆస్కారం ఉండబోదన్నారు. ‘నితీశ్ కుమార్‌‌కు బిహార్‌‌కు కావాల్సినవన్నీ చేశారని నేను చెప్పట్లేదు. ఆయన ఎక్కువ పని చేశారా, తక్కువ చేశారా, లేదా ఇంకా ఎక్కువ చేయాల్సిందా అనేది చర్చించాల్సిన అంశం. కానీ ఆయన నిజాయితీని మాత్రం శంకించాల్సిన పని లేదు, దానిపై చర్చ కూడా అనవసరం’ అని రాజ్‌‌‌నాథ్ చెప్పారు.