మా అభ్యర్థిని బీజేపీ కిడ్నాప్ చేసింది : మనీష్ సిసోడియా

మా అభ్యర్థిని బీజేపీ  కిడ్నాప్ చేసింది : మనీష్ సిసోడియా

గుజరాత్‌లోని సూరత్ ఈస్ట్ నుంచి బరిలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి కంచన్ జరీవాలా నిన్నటి నుంచి హఠాత్తుగా కనిపించకుండా పోయారు. అతని అదృశ్యం వెనుక బీజేపీ హస్తం ఉందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయం బీజేపీలో ఉందని, అందుకే తమ పార్టీ అభ్యర్థిని కిడ్నాప్ చేసిందని అన్నారు. కంచన్ జరీవాలాతో పాటు అతని కుటుంబం కూడా కనిపించడం లేదని చెప్పారు. నామినేషన్‌ పరిశీలన ముగించుకుని పార్టీ కార్యాలయానికి తిరిగి వెళ్తుండగా బీజేపీకి చెందిన కొందరు నేతలు కంచన్ జరీవాలను ఎత్తుకెళ్లారని ఆరోపించారు. ‘ఇది కేవలం అభ్యర్థినే కాదు.. ప్రజాస్వామ్యాన్ని అపహరించడమే’ అని సిసోడియా అన్నారు. 

కేజ్రీవాల్ ట్వీట్ 

ఈ ఘటనపై పలువురు ఆప్ నేతలు కూడా స్పందిస్తున్నారు."కంచన్ జరీవాలా అతని కుటుంబ సభ్యులు నిన్నటి నుంచి అదృశ్యమయ్యారు. మొదట అతని నామినేషన్ తిరస్కరించడానికి బీజేపీ ప్రయత్నించింది. కానీ, నామినేషన్ ఆమోదించబడింది. తరువాత నామినేషన్ ను ఉపసంహరించుకోవాలని బీజేపీ.. కంచన్ జరీవాలపై ఒత్తిడి చేసింది. అయితే ఆయన్ను కిడ్నాప్ చేశారా..? " అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.

ఆప్ నేత రాఘవ్ చద్దా ట్వీట్ 

ఆప్‌కి చెందిన మరో నేత రాఘవ్ చద్దా కూడా ట్వీట్ చేశారు. అయితే ఆప్ ఆరోపణలపై బీజేపీ ఇప్పటి వరకు స్పందించలేదు.