
కేసీఆర్ తో బండి సంజయ్ చర్చకు వస్తారని ప్రకటన
రాష్ట్రానికి కేంద్రం ఇస్తున్న నిధులపై ఆర్థికమంత్రి హరీష్ రావుకి స్పష్టత లేకపోవటం సిగ్గుచేటని అన్నారు బీజేపీ నాయకురాలు డీకే అరుణ. రాష్ట్రం లో ఒక స్ట్రీట్ లైట్ పెట్టాలన్న కేంద్ర నిధులతోనే అని ఆమె అన్నారు. తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే చేస్తున్నదని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై హరీష్ విమర్శించారు. బీజేపీ అసత్య ప్రచారాలను నిరూపించడానికి దుబ్బాక బస్టాండ్ సెంటర్కు రావడానికి సిద్ధమేనా అని సవాల్ విసిరిన హరీష్ కు ప్రతి సవాల్ విసిరారు.కేంద్ర నిధులపై టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చర్చకు వస్తారని ప్రకటించారు.
దుబ్బాక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్ లోకి పంపించి హరీష్ రావే టికెట్ ఇప్పించాడని డీకే అరుణ అన్నారు. దుబ్బాకలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏంటో హరీష్ రావు చెప్పాలన్నారు. అభివృద్ధిలో సిద్ధిపేట, గజ్వేల్ కు.. దుబ్బాకకు సంబంధం లేదని, గజ్వేల్ , సిద్ధిపేట, సిరిసిల్ల మీ కుటుంబ చేతిలో ఉంటే.. దుబ్బాక గెలవాలని ఎక్కడైన రాసి ఉందా? అని ఆమె ప్రశ్నించారు.
దుబ్బాకలో బీజేపీ కార్యకర్తల జోలికొస్తే టీఆర్ఎస్ అంతు చూస్తామని హెచ్చరించారు అరుణ. ఓటమి భయంతోనే మంత్రి హరీష్ రావు దుబ్బాక ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, దుబ్బాక ఎన్నిక టీఆర్ఎస్ కు మింగుడు పడటంలేదని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధిపై కేసీఆర్ మాట తప్పారని, టీఆర్ఎస్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఆమె అన్నారు.