- అద్దె గది ఖాళీ చేయాలంటూ మసీదు కమిటీ సభ్యులు వేధిస్తున్నారని సెల్ఫీ వీడియో
పద్మారావునగర్, వెలుగు: ముషీరాబాద్లో బీజేపీ నాయకుడు దొడ్ల యాదగిరి(54) సూసైడ్ చేసుకున్నాడు. అంతకుముందు వ్యాపారం కోసం తాను అద్దెకు తీసుకున్న గదిని ఖాళీ చేయాలంటూ మసీదు కమిటీ సభ్యులు వేధిస్తున్నారని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. యాదగిరి కుటుంబం స్థానిక అహ్లే హదీస్ మసీదుకు చెందిన గదిని అద్దెకు తీసుకుని తాతల కాలం నుంచి బొగ్గు వ్యాపారం చేస్తోంది. దాన్నే యాదగిరి కొనసాగిస్తున్నారు. క్రమం తప్పకుండా అద్దె చెల్లిస్తున్నారు. అయితే, 15 ఏండ్ల క్రితం అక్కడే చేపల వ్యాపారం ప్రారంభించాలని చూసినప్పటి నుంచి వివాదం మొదలైంది. షాప్ను బలవంతంగా ఖాళీ చేయించేందుకు మసీదు కమిటీ సభ్యులు మహమ్మద్ మాజీద్ షరీఫ్, యాసిన్ షరీఫ్, సయ్యద్ ఇక్బాల్, అక్బర్ తదితరులు ఏండ్లుగా ఆయనను వేధింపులకు గురిచేస్తున్నారు.
దీంతో మనస్తాపానికి గురైన యాదగిరి సోమవారం మధ్యాహ్నం దుకాణంలోనే సెల్ఫీ వీడియో తీసుకొని, ఉరేసుకున్నాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు గాంధీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను మంగళవారం అరెస్ట్చేసి, రిమాండ్కు తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కుమార్తెకు ఇటీవలే పెళ్లి చేశారు.
బందోబస్తు మధ్య అంత్యక్రియలు
అంత్యక్రియల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సికింద్రాబాద్ జోన్ అడిషనల్ డీసీపీ నర్సయ్య ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ముషీరాబాద్లోని మొరంబొంద శ్మశానవాటికలో అంత్యక్రియలు జరిగాయి. ఎంపీలు ఈటల రాజేందర్, కె.లక్ష్మన్లు, స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ యాదగిరి కుటుంబసభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు.
