పేద, మధ్య తరగతిని ఆకర్షించేలా బీజేపీ మేనిఫెస్టో : కొండా విశ్వేశ్వర్ రెడ్డి

పేద, మధ్య తరగతిని ఆకర్షించేలా బీజేపీ మేనిఫెస్టో : కొండా విశ్వేశ్వర్ రెడ్డి

చేవెళ్ల, వెలుగు: పేద, మధ్య తరగతి జనాలను ఆకర్షించేలా బీజేపీ మేనిఫెస్టో ఉండబోతోందని మాజీ ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర రెడ్డి, చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కేఎస్ రత్నం తెలిపారు. శుక్రవారం చేవెళ్ల మండలంలోని మడికట్టు, తంగడ్​పల్లి, దుద్దాగు, తల్లారం, కౌకుంట్ల, అంతారం, హసైపూర్, నవులయపల్లి, కుమ్మెర, ముడిమ్యాల, రావులపల్లి, మల్కాపూర్ గ్రామాల్లో కొండా విశ్వేశ్వర రెడ్డితో కలిసి కేఎస్ రత్నం పర్యటించారు.  

ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల  ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో ఆయనకు పెద్ద ఎత్తున స్వాగతం లభించింది. ఈ సందర్భంగా రత్నం మాట్లాడుతూ.. చేవెళ్లలో ఎమ్మెల్యేగా గెలిచి నిజాయతీగా సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.  కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కేఎస్ రత్నం కోరారు.