
మహబూబ్ నగర్ (నారాయణపేట), వెలుగు: నారాయణపేట పట్టణంలోని జిల్లా ఆసుపత్రిని 10 కిలోమీటర్ల దూరంలోని మెడికల్ కాలేజీకి తరలించడం సరైంది కాదని, వెంటనే ఏరియా ఆసుపత్రిని ప్రారంభించాలని బీజేపీ నేత నాగూరావు నామాజీ డిమాండ్ చేశారు. శుక్రవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్య యాదవ్ ఆధ్వర్యంలో జిల్లా ఆసుపత్రి తరలింపును నిరసిస్తూ నిరాహార దీక్ష చేపట్టారు. అంతకుముందు పళ్ల హనుమాన్ టెంపుల్ నుంచి ర్యాలీ నిర్వహించి, సత్యనారాయణ చౌరస్తాలో దీక్ష చేపట్టారు.
పార్టీ నేతలు రతంగ్ పాండు రెడ్డి, పగుడాకుల శ్రీనివాసులు దీక్షను ప్రారంభించారు. జిల్లా ఆసుపత్రిని తరలించే సమయంలో 60 వేల జనాభా ఉన్న పట్టణంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. దీంతో పట్టణ ప్రజలు వైద్యానికి దూరమయ్యారని పేర్కొన్నారు. వెంటనే నారాయణపేటలో ఆసుపత్రి ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.