హైదరాబాద్, వెలుగు: రేవంత్ రెడ్డి తన స్థాయి మరిచి కేంద్ర హోం మంత్రి అమిత్ షా పై కామెంట్లు చేయడం హాస్యాస్పదంగా ఉందని బీజేపీ నేత, తమిళనాడు సహ ఇన్చార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంపై దేశ ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారని, అందుకే వివిధ పార్టీల నాయకులు బీజేపీలో చేరుతున్నారని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ దేశవ్యాప్తంగా రోజురోజుకు బలహీనపడి ప్రజల విశ్వాసం కోల్పోతున్నదని ఓ ప్రకటనలో ఆయన వ్యాఖ్యానించారు. అది తట్టుకోలేక రేవంత్ రెడ్డి..షా పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రేవంత్ భాషను ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. దిగజారి వ్యక్తిగత విమర్శలు చేయడం సమంజసం కాదని ఆయన హితవు పలికారు.