హైదరాబాద్​లో నువ్వా నేనా?

హైదరాబాద్​లో నువ్వా నేనా?

బీజేపీ–మజ్లిస్​ మధ్యే పోటీ
    1984 నుంచి ఇక్కడ మజ్లిస్​దే గెలుపు
    ఎన్నడూలేని విధంగా వాడల్లో అసదుద్దీన్ ప్రచారం
    పాతబస్తీలో బీఆర్ఎస్ ఖాళీ​

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ పార్లమెంట్ పై ఎవరు పాగా వేస్తారన్నదానిపై ఆసక్తి నెలకొంది.1984 నుంచి ఇక్కడ జరిగే ప్రతి ఎన్నికల్లో ఎంఐఎం పార్టీనే గెలుస్తోంది. అప్పటి నుంచి1999 వరకు సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ వరుసగా ఆరు సార్లు ఎంపీగా విజయం సాధించగా, ఆయన తదనంతరం 2004 నుంచి ఇప్పటి వరకు ఆయన కొడుకు అసదుద్దీన్ ఒవైసీ ఎంపీగా గెలుస్తూ వస్తున్నారు. ఎంఐఎం నుంచి మరోసారి అసదుద్దీన్ ఒవైసీ బరిలో ఉండగా, బీజేపీ నుంచి ఈ సారి ధార్మికవేత్త మాధవీలత పోటీలో ఉన్నారు.

 కాంగ్రెస్​ నుంచి వలీవుల్లా సమీర్ కి టికెట్ దక్కింది. బీఆఎర్ఎస్​ నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్ తలపడుతున్నారు. నేటితో ప్రచారం గడువు ముగుస్తుండడంతో ఇప్పటికే నియోజకవర్గాన్ని చుట్టేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అసదుద్దీన్ ఒవైసీ కాలనీల్లో తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. ప్రచారానికి సంబంధించిన ప్రచార రథాలపై తెలుగు వాక్యాలు, తెలుగు పాటలతో ప్రచారం నిర్వహిస్తున్నారు. మైనార్టీ ఓట్లపైనే కాకుండా అందరి ఓట్లు రాబాట్టేలా ప్లాన్ ​చేశారు. మరోవైపు బీజేపీ అభ్యర్థి కూడా జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఆమె ప్రత్యర్థులపై చేస్తున్న విమర్శలు, సవాళ్లు సోషల్ మీడియాతో వైరల్ అవుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్​ అభ్యర్థులు కూడా ఎక్కడా తగ్గట్లేదు.  

1991లో  గట్టిపోటీ ఇచ్చిన బీజేపీ 

1991లో హైదరాబాద్​ పార్లమెంట్​ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున బద్దం బాల్ రెడ్డి పోటీ చేసి 39 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. నాటి నుంచి కూడా ఇక్కడ ఎంఐఎందే హవా. మైనార్టీ ఓటర్లు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో ఇతరులకు అవకాశం లభించడం లేదు. గత రెండు ఎన్నికల్లో బీజేపీ నుంచి భగవంత్ రావు పోటీ చేయగా 2 లక్షలకుపైగా మెజారిటీతో ఎంఐఎం గెలుపొందింది. 2014 ఎన్నికల్లో అసదుద్దీన్ ఒవైసీ 55.16 శాతంతో 5,13,868 ఓట్లు సాధించి గెలుపును సొంతం చేసుకోగా, బీజేపీ అభ్యర్థి భగవంతరావు. 33.56 శాతం ఓట్లతో 3,11,414 ఓట్లు పొంది రెండో స్థానానికి పరిమితమయ్యారు. 2019లో బీజేపీ పరిస్థితి మరింత దిగజారింది. ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ 2014 తో పోలిస్తే 58.94 శాతం పెంచుకున్నారు. దీంతో ఈసారి నియోజకవర్గంలో మొదటిసారిగా పాతబస్తీ మూలాలున్న మహిళా అభ్యర్థిని బీజేపీ బరిలోకి దింపింది. మాధవీలతకు ఓల్డ్ సిటీతో సత్సంబంధాలు ఉండడంతో గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. ఆమె కూడా అదే స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు.

కాంగ్రెస్​కు ఓట్లు పెరిగే ఛాన్స్ 

అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వ పథకాలతో మాత్రమే బీఆర్ఎస్​కు కొన్ని ఓట్లు వచ్చాయి. ఇందులో అత్యధికంగా గోషామహల్ లో వచ్చినవే ఉన్నాయి. ఇక్కడ కూడా లీడర్లు అంతా ఖాళీ కావడంతో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గతంలో కంటే ఓట్లు తగ్గే అవకాశం ఉంది. కాంగ్రెస్​ విషయానికొస్తే గతంతో పోలిస్తే ఈ సారి ఓట్లు పెరిగే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్​ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉచిత బస్సు జర్నీతో పాటు పాతబస్తీకి మెట్రో రైల్, ఇతర ప్రభుత్వ పథకాలతో ఇది సాధ్యమవుతుందని ఆ పార్టీ లీడర్లు నమ్ముతున్నారు. 

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు నియోజకవర్గాల్లో ఓట్లు చూస్తే ఎంఐఎంకు 4,23,676, బీజేపీకి 2,21,954, కాంగ్రెస్​ 1,01,014, బీఆర్ఎస్​కు1,68,367 ఓట్లు రాగా 50వేల వరకు ఓట్లను ఎంబీటీ సాధించింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఎంఐఎంకు 5,17,471 ఓట్లు రాగా, బీజేపీకి 2,35,285 ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది. బీఆర్ఎస్​ 63,239 , కాంగ్రెస్ 49,994 ఓట్లతో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో బీఆర్ఎస్​పార్టీ లీడర్లంతా ఖాళీ కావడంతో ఆ పార్టీకి గతంలో వచ్చిన ఓట్లు వచ్చే అవకాశం కూడా లేదన్న చర్చ జరుగుతోంది.

అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటర్లు

నియోజకవర్గం    మహిళలు    పురుషులు    ఇతరులు           మొత్తం ఓటర్లు
మలక్‌‌పేట్            1,56,369          1,59,250               15                        3,15,634
కార్వాన్                  1,77,588         1,85,420                 9                         3,63,017
గోషామహల్           1,31,463         1,43,179                 26                        2,74,668
చార్మినార్               1,09,251        1,19,217                30                        2,28,498
చాంద్రాయణగుట్ట    174,635      1,72,944                35                        3,47,614
బహదూర్‌‌పూరా     1,59,954        1,61,240                 50                        3,21,244
యాకుత్ పురా       1,76,266         1,79,682                31                        3,55,979
మొత్తం                  10,85,526       11,20,932             196                        22,06,654