ప్రధానిని రిసీవ్ చేసుకునే సంస్కారం కేసీఆర్కు లేదు

ప్రధానిని రిసీవ్ చేసుకునే సంస్కారం కేసీఆర్కు లేదు

సీఎం కేసీఆర్కు రాజ్యాంగం మీద విశ్వాసం లేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మండిపడ్డారు.  రాజ్యాంగాన్ని గౌరవించే సంస్కారం లేదని విమర్శించారు.  సీఎం కుర్చీ రాజ్యాంగ విలువలను కాపాడేందుకు  ఉందన్నారు. కానీ సీఎం కేసీఆర్ ఆ కుర్చీని  సొంత జాగీరులా వాడుకుంటున్నారని ఆరోపించారు. దేశ ప్రధాని రాష్ట్రానికి వచ్చిన సమయంలో రిసీవ్ చేసుకునే సంస్కారం, మర్యాద లేని ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం ఉందని తెలిసి కావాలనే..హైదరాబాద్లో తన ముఖమే కనిపించాలన్న అహంకారంతో ప్రజల సొమ్ము రూ.33 కోట్లను యాడ్స్ రూపంలో ఏర్పాటు చేశారని ఆరోపించారు.  బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను సైడ్ ట్రాక్ చేయాలన్న  దుర్భుద్దితో  హడావుడిగా  విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను హైదరాబాద్ కు రప్పించకున్నారని విమర్శించారు. కేసీఆర్ కుట్రలను, కుఠిల బుద్దిని ప్రజలు గమనిస్తున్నారు.  ఖచ్చితంగా కర్రుకాల్చి వాత పెట్టే రోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను బీజేపీ, కేంద్ర ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందన్నారు. సమయం వచ్చినప్పుడు గుణపాఠం తప్పకుండా చెప్తామని ఈటెల రాజేందర్ అన్నారు.