ఆప్ సర్కార్ ను కూల్చేందుకు బీజేపీ పన్నాగం

ఆప్ సర్కార్ ను కూల్చేందుకు బీజేపీ పన్నాగం

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సొంత ప్రభుత్వంపైనే విశ్వాస తీర్మానాన్ని ప్రవేపెట్టారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో మాట్లాడిన ఆయన బీజేపీపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాషాయ పార్టీ ‘ఆపరేషన్‌ కమలం’ ఢిల్లీలో విఫలమైందని నిరూపించేందుకే తాను అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని తీసుకొచ్చానని చెప్పారు. ఆప్‌ ఎమ్మెల్యేలు నిజాయతీపరులని, పార్టీకి విధేయులుగా ఉంటారని అన్నారు. ‘మణిపుర్‌, బిహార్‌, అస్సాం, మహారాష్ట్రల్లో ప్రభుత్వాలన కూల్చివేశారని ఆరోపించారు. కొన్ని చోట్ల అయితే ఒక్కో ఎమ్మెల్యేను రూ.50 కోట్ల చొప్పున కొనేశారని, ఢిల్లీలోనూ అలాంటి ప్రయత్నాలు జరిగాయని చెప్పారు.

ఆప్‌ను వీడి బీజేపీలో చేరితే రూ.20కోట్లు ఇస్తామంటూ 12 మంది ఎమ్మెల్యేలకు ఆఫర్‌ చేశారని, కానీ బీజేపీ ఆపరేషన్‌ కమల్‌ విఫలమైందన్నారు. తమ ఎమ్మెల్యేలు నిజాయతీపరులని, ఆప్ నుంచి ఒక్క ఎమ్మెల్యేను కూడా బీజేపీ వాళ్లు కొనుగోలు చేయలేరని రుజువు చేసేందుకే ఢిల్లీ అసెంబ్లీలో తీర్మానం తీసుకొచ్చానని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ చెప్పారు. త్వరలో ఇంధన ధరలు మరింత పెరుగుతాయని, ఆ రేట్ల పెంపుతో వచ్చిన ఆదాయాన్ని ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ఉపయోగిస్తున్నారని కేంద్రంపై ఆరోపణలు చేశారు. ప్రస్తుతం విశ్వాస తీర్మానంపై ఢిల్లీ అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. ఆ తర్వాత ఓటింగ్‌ నిర్వహించనున్నారు.

అంతకుముందు అసెంబ్లీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సమావేశాలు ప్రారంభం కాగానే బీజేపీ ఎమ్మెల్యేలు సభలో ఆందోళనకు దిగారు. ఆప్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం విధానం, తరగతి గదుల నిర్మాణాల్లో జరిగిన అవకతవకలపై చర్చ చేపట్టాలంటూ పట్టుబట్టారు. అయితే.. డిప్యూటీ స్పీకర్‌ అంగీకరించకపోవడంతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు వెల్‌లోకి దూసుకొచ్చి ఆందోళన చేపట్టారు. దీంతో వారు సభ నుంచి బయటకు వెళ్లిపోవాలని డిప్యూటీ స్పీకర్‌ ఆదేశించారు. అయినా వారు వినిపించుకోకపోవడంతో మార్షల్స్‌తో బలవంతంగా బీజేపీ ఎమ్మెల్యేలను బయటకు పంపించేశారు.

గత వారం అరవింద్ కేజ్రీవాల్ తన ఇంట్లో జరిగిన సమావేశానికి ఢిల్లీలోని ఆప్‌కి చెందిన 62 మంది ఎమ్మెల్యేలలో 53 మంది మాత్రమే హాజరైన సంగతి తెలిసిందే. మరోవైపు ఢిల్లీ మద్యం పాలసీలో అవకతవకలు జరిగాయని, అవినీతికి సంబంధించిన కేసులో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇంట్లో సీబీఐ అధికారులు ఇటీవల దాడులు చేశారు.