మోడీ పాలనకు నితిన్, మిథాలీ ఫిదా అయ్యారు

మోడీ పాలనకు నితిన్, మిథాలీ ఫిదా అయ్యారు

ప్రధాని నరేంద్ర మోడీ కోసం బీజేపీ తరపున ప్రచారం చేయడానికి సినీ హీరో నితిన్ సిద్ధంగా ఉన్నారని రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ తెలిపారు. భారత క్రికెట్ మహిళా జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా బీజేపీ తరుపున ప్రచారానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారని వివరించారు. నరేంద్ర మోడీ పాలనకు తాము ఫిదా అయ్యామని నితిన్, మిథాలీ రాజ్ చెప్పినట్లు లక్ష్మణ్ తెలిపారు. త్వరలో వారిద్దరూ మోడీని కలుస్తారన్న లక్ష్మన్..ప్రధాని సూచనతోనే నడ్డాను కలిసినట్లు చెప్పారు. అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ సమావేశంలోనూ రాజకీయాలు చర్చకు వచ్చాయన్నారు. 

బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో హీరో నితిన్, మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్ వేర్వేరుగా భేటీ అయ్యారు. వీరి మధ్య ఎలాంటి అంశాలు చర్చకు వచ్చాయనేది రాజకీయ, సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. అయితే తెలంగాణపై ఫోకస్ చేసిన బీజేపీ..వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. రాజకీయ నాయకులనే కాకుండా సినీ స్టార్స్ పై కూడా ఫోకస్ పెట్టింది. ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చిన కేంద్రమంత్రి అమిత్ షా.. స్టార్ హీరో ఎన్టీఆర్ తో భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీసింది. ఇవాళ్టి పర్యటనలో నడ్డా కూడా నితిన్, మిథాలీ భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది.