న్యూఢిల్లీ, వెలుగు: త్వరలో తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తప్పక గెలవాల్సిందేనని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా స్పష్టం చేశారు. మంగళవారం ఢిల్లీలోని బీజేపీ హెడ్ అఫీస్లో నడ్డా అధ్యక్షతన నేషనల్ జనరల్ సెక్రటరీల మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి తొలిసారి నేషనల్ జనరల్ సెక్రటరీ హోదాలో బండి సంజయ్ హాజరయ్యారు. రాష్ట్ర ఇన్చార్జులు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ కూడా పాల్గొన్నారు.
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలతో పాటు సార్వత్రిక ఎన్నికలు, సంస్థాగత అంశాలపై సమావేశంలో చర్చించారు. తెలంగాణలో పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఈ సందర్భంగా రాష్ట్ర నేతలు తెలియజేశారు. ఆ దిశగా త్వరలో రాష్ట్రంలో బీజేపీ చేపట్టబోయే కార్యక్రమాలు, ఇతర అంశాలను ప్రస్తావించారు.
ఈ సందర్భంగా తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలని జనరల్ సెక్రటరీలకు నడ్డా సూచించారు. హైకమాండ్ నుంచి పూర్తి స్థాయి సపోర్ట్ ఉంటుందని స్పష్టం చేశారు. ఈ మీటింగ్లో సంజయ్ని నడ్డా అభినందించారు.