మా ఎమ్మెల్యేలకు రూ.25 కోట్లు ఇస్తామని ఆఫర్ : సీఎం సంచలన కామెంట్స్

మా ఎమ్మెల్యేలకు రూ.25 కోట్లు ఇస్తామని ఆఫర్ : సీఎం సంచలన కామెంట్స్

ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ నేతలు కుట్రపన్నుతున్నారని ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు. ప్రభుత్వం కూల్చేందుకు ఇటీవలె కొందరు బీజేపీ నాయకులు తమ ఎమ్మెల్యేలను సంప్రదించారని చెప్పారు. 21 మంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలతో చర్చలు జరిపారని ఆరోపించారు. తాను ఈ విషయం పై ఏడుగురితో మాట్లాడానని వారంతా తిరస్కరించామని చెప్పారని తెలిపారు. 

  కొన్ని రోజుల తర్వాత కేజ్రీవాల్‌ను అరెస్టు చేస్తామని తమ ఎమ్మెల్యేలతో వారు చెప్పినట్టు తెలిసిందని కేజ్రీవాల్ అన్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలపై విరుచుకుపడతామని బెదిరింపులకు గురిచేశారని తెలిపారు. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని హెచ్చరించారని ఇందుకు ఒప్పుకుంటే 25 కోట్లు ఇచ్చి ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై పోటీ చేపిస్తామని ఆప్ ఎమ్మెల్యేలతో చెప్పారని కేజ్రీవాల్ అన్నారు.
 
 మద్యం కుంభకోణంపైనా దర్యాప్తు చేసేందుకు తనను అరెస్టు చేయడం లేదని కేవలం ప్రభుత్వాన్ని కూల్చేందుకు తనని అరెస్టు చేస్తున్నారని కేజ్రివాల్ అన్నారు. గత తొమ్మిదేళ్లలో ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఎన్నో కుట్రలు పన్నారని ఆరోపించారు. కానీ అవి ఏ మాత్రం విజయం సాధించలేదని తెలిపారు. దేవుడు, ప్రజలు ఎల్లప్పుడూ తమకు మద్దతు ఇచ్చారని అన్నారు. ఢిల్లీ ప్రజలు ఆప్ ని అమితంగా ప్రేమిస్తారని చెప్పారు. తమ ఎమ్మెల్యేలంతా కలిసి ఉన్నారని ఆప్ చీఫ్ తెలిపారు.