ఛత్తీస్​గఢ్​ లో మ్యాజిక్​ ఫిగర్​ దాటిన బీజేపీ

ఛత్తీస్​గఢ్​ లో మ్యాజిక్​ ఫిగర్​ దాటిన బీజేపీ

ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం అసెంబ్లీ స్థానాలు 90 కాగా అధికారంలోకి రావాలంటే మ్యాజిక్ ఫిగర్ 46 సీట్లు కైవసం చేసుకోవాలి. అయితే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్థానాల కంటే కూడా ఎక్కువ అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రస్తుతం  ( 12 గంటలకు) 54 స్థానాల్లో బీజేపీ లీడ్‌లో ఉండగా.. కాంగ్రెస్ 34 స్థానాల్లో, ఇతరులు 2 స్థానాల్లో ముందజలో కొనసాగుతున్నారు. 2018లో కాంగ్రెస్ 71, బీజేపీ 14, సీట్లను గెలుచుకున్నాయి. ఇతరులు కూడా కొన్ని చోట్ల గెలుపొందారు. గతంలో ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసినట్లు ఈసారి బీజేపీ తన ఆధిపత్యాన్ని చూపిస్తోంది.

ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పినప్పటికీ వాటిని తారుమారు చేస్తూ బీజేపీ ముందంజలో దూసుకుపోతోంది.మొదటి రౌండ్​ లో కౌంటింగ్‌లో కాంగ్రెస్ ఆధిక్యంలో దూసుకుపోయినప్పటికీ క్రమంగా వెనకంజలో పడిపోయింది. అంబికాపూర్ స్థానంలో ఛత్తీస్‌గఢ్ ఉపముఖ్యమంత్రి టీఎస్ సింగ్ డియో ముందంజలో ఉన్నారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న భూపేష్ బఘెల్ వెనుకంజలో ఉన్నారు. 

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లా కేంద్రాల్లో కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగుతోంది. దీనికోసం 90 మంది రిటర్నింగ్ అధికారులు, 416 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, 1,698 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 1.181 మంది అభ్యర్థుల బరిలో నిలువగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది.