పెద్ద ఎత్తున చేరికలకు బీజేపీ రాష్ట్ర జాయినింగ్స్ కమిటీ ఏర్పాట్లు

పెద్ద ఎత్తున చేరికలకు బీజేపీ రాష్ట్ర జాయినింగ్స్ కమిటీ ఏర్పాట్లు

హైదరాబాద్, వెలుగు: ఈ నెల 21న మునుగోడు నియోజకవర్గానికి వస్తున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో పెద్ద ఎత్తున చేరికలకు బీజేపీ రాష్ట్ర జాయినింగ్స్ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ నెల 21న చౌటుప్పల్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. దీనికి అమిత్ షాను ఆహ్వానించారు. ఆయన సమక్షంలోనే రాజగోపాల్ బీజేపీ కండువా కప్పుకోనున్నారు. కేవలం రాజకీయ ప్రముఖులే కాకుండా వివిధ రంగాల ప్రముఖులను, వివిధ సామాజిక వర్గాలకు చెందిన పెద్దలను ఈ సభలో బీజేపీలోకి ఆహ్వానించేలా రాష్ట్ర పార్టీ చేరికల కమిటీ ప్రణాళిక సిద్ధం చేస్తోంది.

సీనిరంగ ప్రముఖులు, రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఉన్నతాధికారులు, వ్యాపార, వాణిజ్య రంగాల ప్రముఖులను పార్టీలో చేర్పించేందుకు ముమ్మురంగా ప్రయత్నిస్తోంది. సినీనటి జయసుధ కూడా పార్టీలో చేరనున్నారనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఇప్పటికే బీజేపీ చేరికల కమిటీ నేతలు ఆమెతో చర్చించినట్లు సమాచారం. అయితే ఆమె 21న కాకుండా ఆ తర్వాత ఢిల్లీలో పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీలో  చేరికలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న కమలనాథులు.. టీఆర్ఎస్, కాంగ్రెస్ లకు చెందిన సీనియర్ నేతలను ఆహ్వానించేలా ప్రయత్నాలను ముమ్మరం చేయడంతో ఆ రెండు పార్టీలకు చెందిన నేతల్లో ఎవరు బీజేపీలో చేరనున్నారనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.