మణిపూర్లో జరిగిన ఒక రాకెట్ దాడిలో ఇద్దరు చిన్నారులు చనిపోవడం, మరికొందరికి గాయాలు కావడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనతో రాష్ట్రంలో మళ్ళీ ఉద్రిక్తతలు పెరగడంతో, ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
మణిపూర్లో ఇంటర్నెట్ బంద్
మణిపూర్లో హింస మళ్ళీ చెలరేగడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. శాంతి భద్రతలను కాపాడటం కోసం ఐదు జిల్లాల్లో మూడు రోజుల పాటు మొబైల్ ఇంటర్నెట్ను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దింతో ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్, తౌబాల్, కాక్చింగ్, బిష్ణుపూర్ జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు ఆగిపోయాయి.
సోషల్ మీడియా ద్వారా తప్పుడు వార్తలు, పుకార్లు వ్యాపించకుండా అడ్డుకోవడానికే అధికారులు ఈ చర్య తీసుకున్నారు.
బిష్ణుపూర్ జిల్లాలోని ఒక గ్రామంలో అర్ధరాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో ఉగ్రవాదులు రాకెట్ దాడి చేశారు. ఈ పేలుడులో 5 ఏళ్ల బాలుడు, ఆరు నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయారు. అలాగే మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
ALSO READ : సీఎం హిమంత భార్యపై ఆరోపణలు
ఈ దారుణ ఘటనతో ప్రజలు ఆగ్రహంతో నిరసనలకు దిగారు. గొడవలు పెద్దవి కాకుండా ఉండటానికి బిష్ణుపూర్లో ప్రభుత్వం వెంటనే కర్ఫ్యూ విధించింది.
ఇప్పటికే మైతేయ్, కుకీ వర్గాల మధ్య గొడవలతో అశాంతిగా ఉన్న మణిపూర్లో, ఈ దాడి పరిస్థితులను మరింత ఆందోళనకరంగా మార్చింది.
పిల్లల మరణవార్త విన్న స్థానికులు ఆగ్రహంతో రోడ్లపైకి వచ్చారు. ఈ క్రమంలో నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఓ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న రెండు ఆయిల్ ట్యాంకర్లకు, ఒక లారీకి నిరసనకారులు నిప్పు పెట్టారు. పోలీస్ స్టేషన్ బయట టైర్లను తగలబెట్టడమే కాకుండా, అక్కడ ఉన్న ఒక తాత్కాలిక పోలీస్ అవుట్పోస్ట్ ధ్వంసం చేశారు.
గొడవలు ఆపడానికి, శాంతిని కాపాడటానికి ప్రభుత్వం అదనపు బలగాలను రంగంలోకి దించింది. ఈ దారుణ ఘటనపై ముఖ్యమంత్రి వై ఖేమ్చంద్ సింగ్ తీవ్రంగా స్పందించారు.
ఇది అత్యంత క్రూరమైన చర్య. అమాయక పిల్లలపై జరిగిన ఈ దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వారిని వెంటనే పట్టుకుని, చట్టపరంగా కఠినంగా శిక్షిస్తాం అని అన్నారు.
ఘటనా స్థలానికి సమీపంలో పోలీసులు మరో పేలుడు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
