సీఎం హిమంత భార్యపై ఆరోపణలు: పవన్ ఖేరా ఇంటికి అస్సాం పోలీసులు

సీఎం హిమంత భార్యపై ఆరోపణలు: పవన్ ఖేరా ఇంటికి అస్సాం పోలీసులు

న్యూఢిల్లీ: అస్సాం అసెంబ్లీ ఎన్నికల వేళ సీఎం హిమంత బిస్వా శర్మ భార్యపై కాంగ్రెస్ సీనియర్ లీడర్ పవన్ ఖేరా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. హిమంత బిస్వా శర్మ భార్య రినికి భూయాన్‎కు మూడు పాస్ పోర్టులు ఉన్నాయంటూ పవన్ ఖేరా చేసిన వ్యాఖ్యలపై అస్సాంలో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా అస్సాం పోలీసులు మంగళవారం (ఏప్రిల్ 6) ఢిల్లీలోని పవన్ ఖేరా ఇంటికి వెళ్లారు.

 నలుగురు సభ్యుల అస్సాం పోలీసు బృందం నిజాముద్దీన్ రోడ్డులో ఉన్న ఖేరా నివాసంలో సోదాలు నిర్వహించింది. ఆ సమయంలో పవన్ ఖేరా ఇంట్లో లేకపోవడంతో పోలీసులు ఆయన కోసం చాలా సేపు ఎదురు చూశారు. ఈ ఆపరేషన్‌కు ఢిల్లీ కాప్స్ అస్సాం పోలీసులకు సహకరించారు.

 వివాదం ఏమిటంటే..?

అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ భార్య రినికి భూయాన్‎కు మూడు పాస్ట్ పోర్టులు ఉన్నాయంటూ కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఆరోపించారు. పవన్ ఖేరా వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై రినికి భూయాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పవన్ ఖేరాపై అస్సాం పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విచారణలో భాగంగా మంగళవారం (ఏప్రిల్ 6) ఢిల్లీలోని పవన్ ఖేరా నివాసానికి వెళ్లింది అస్సాం పోలీస్ టీమ్. కానీ ఆ సమయంలో ఆయన ఇంట్లో లేరు.  పవన్ ఖేరా పోలీసుల విచారణను తప్పించుకోవడాన్ని సీఎం హిమంత విమర్శించారు. పోలీసులకు భయపడి పవన్ ఖేరా హైదరాబాద్ పారిపోయాడని సీఎం ఎద్దేవా చేశారు. 

ALSO READ : హరీశ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు..

అస్సాం పోలీసులపై కాంగ్రెస్ ఫైర్:

కేసు విచారణలో భాగంగా అస్సాం పోలీసులు ఢిల్లీలోని  పవన్ ఖేరా నివాసంలో సోదాలు నిర్వహించడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కర్ణాటక మంత్రి కార్తీ చిదంబరం అస్సాం పోలీసులను ప్రైవేట్ మిలీషియాగా అభివర్ణించారు. మరో సీనియర్ లీడర్ జైరాం రమేష్ ఈ చర్యను కక్ష సాధింపు చర్యగా పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పవన్ ఖేరాను అరెస్ట్ చేసేందుకు అస్సాం పోలీసులు రావడం సీఎం హిమంత బిస్వా శర్మ అంతర్గత ఆందోళనకు నిదర్శనమన్నారు.