
బీఆర్ఎస్కు జాతీయాధ్యక్షుడే లేడని.. అటువంటిది ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిని ఎలా ప్రకటిస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. ఏపీకి క్యాబ్లను పంపించి.. బీఆర్ఎస్లో చేరేందుకు నేతలను పిలిపించుకున్నారని ఆరోపించారు. గతంలో ఏపీ ప్రజలను అవమానించిన కేసీఆర్ ఇప్పుడు ఏపీ అభివృద్ధికి గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఏపీ వ్యాపారులు ఇక్కడ ప్రశాంతంగా వ్యాపారం చేసుకునే పరిస్థితి లేదన్నారు. కేసీఆర్ మళ్లీ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఏపీ ప్రజలను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేసిండన్నారు.
కేసీఆర్ అనాలోచిత నిర్ణయాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. 24 గంటల కరెంట్ రాష్ట్రంలో ఎక్కడ ఇస్తున్నారో చెప్పాలన్నారు. డిస్కంలు 60వేల కోట్ల నష్టాల్లో ఉన్నాయని చెప్పారు. పొలం దగ్గర ఫ్రీ కరెంట్ ఇస్తూ..ఇంటి దగ్గర ఛార్జీ మోత మోగిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ అంత చీటింగ్ తెలివి ఎవరికి లేదని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ తీరుతో కృష్ణ జలాల్లో వాటా కోల్పోయామన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారని విమర్శించారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పులకుప్పగా మార్చిండన్నారు.
రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ 4వ స్థానంలో ఉందని బండి సంజయ్ తెలిపారు. పాఠశాల విద్యలో చివరి స్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు 17శాతం పెరగినట్లు తెలిపారు. ఫీజు రీఎంబర్స్ మెంట్, నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదన్ంనారు. మద్యంపై 44వేల కోట్ల ఆదాయం వస్తోందని..వాటిని ఏం చేస్తున్నారో తెల్వదన్నారు. నోటిఫికేషన్ల పేరు చెప్పి కోచింగ్ సెంటర్లకు దోచిపెడుతున్నాడని ఆరోపించారు.