ప్రధాని నరేంద్ర మోడీపై పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేడు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టనుంది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఆందోళనలు చేసేందుకు బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ కార్యకర్తలు పాక్ విదేశాంగ మంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బిలావల్ భుట్టో జర్దారీ ప్రకటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీజేపీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.
న్యూయార్క్ వేదికగా బిలావల్ చేసిన వ్యాఖ్యలను భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ గట్టిగా తిప్పికొట్టారు. పాక్ మంత్రి తన అసహనాన్ని స్వదేశంలో ఉన్న ఉగ్రవాదాన్ని జాతీయ విధానంగా పెంచి పోషిస్తున్న సూత్రధారుల వైపు మళ్లిస్తే బాగుంటుందని సూచించారు. ఒసామాబిన్ లాడెన్ను అమరవీరుడని కీర్తిస్తూ లఖ్వి, హఫీజ్ సయీద్, మసూద్ అజర్, దావుద్ ఇబ్రహీం వంటి అసాంఘిక శక్తులకు ఆశ్రయం ఇచ్చిన దేశంగా పాక్ను విమర్శించారు. ఐక్యరాజ్య సమితి గుర్తించిన 126 మంది ఉగ్రవాదులు, 27 ఉగ్రవాద సంస్థలు గల దేశం ప్రపంచంలో మరొకటి ఉండదని బాగ్చీ అన్నారు. ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్న పాక్ ‘ఉగ్రవాద కేంద్రం’గా మారిందంటూ గురువారం న్యూయార్క్లోని ఐరాస భద్రతా మండలి సమావేశంలో భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ పరోక్షంగా ఎండగట్టారు. దీనికి స్పందనగా బిలావల్ ‘గుజరాత్లో ఊచకోతకు కారకుడు (బుచర్ ఆఫ్ గుజరాత్)’గా మోదీని దూషించారు. పాక్ తీరుపై నేడు దేశవ్యాప్తంగా రాష్ట్ర రాజధానుల్లో నిరసనలు తెలపాలని బీజేపీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది.