
- నిబంధనలు పాటించని కాలేజీలపై చర్యలు తీసుకోవాలి
మెహిదీపట్నం, వెలుగు: రాష్ట్రంలోని ఇంజినీరింగ్కాలేజీల నిర్వాహకులు నిబంధనలు పాటించడం లేదని బీజేపీ గిరిజన, దళిత మోర్చా నాయకులు ఆరోపించారు. బి కేటగిరీ మేనేజ్మెంట్, సి కేటగిరీ ఎన్ఆర్ఐ కోటా సీట్లను రూ.లక్షలకు అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం మాసబ్ ట్యాంక్ లోని ఉన్నత విద్యా మండలి చైర్మన్ కార్యాలయానికి వెళ్లి, చైర్మన్బాలకృష్ణారెడ్డికి వినతి పత్రం అందజేశారు.
గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కల్యాణ్ నాయక్, దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ మాట్లాడుతూ.. ప్రైవేట్ఇంజినీరింగ్ కళాశాలలు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రిజర్వేషన్లు అమలు చేయడం లేదన్నారు. ప్రభుత్వం స్పందించి, కాలేజీల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్చేశారు. జీవో 13 ప్రకారం మెరిట్ విద్యార్థులకు సీట్లు కేటాయించాలని కోరారు. పేద విద్యార్థులకు అన్యాయం చేస్తే రానున్న రోజుల్లో ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.