దొంగ బిల్లులు పెట్టి లక్షలు కాజేస్తున్నారు : జీవీ నర్సింహారెడ్డి

దొంగ బిల్లులు పెట్టి లక్షలు కాజేస్తున్నారు : జీవీ నర్సింహారెడ్డి
  • బాధ్యులపై చర్యకు బీజేపీ డిమాండ్

ఆర్మూర్, వెలుగు : రిపేర్ల పేరిట మున్సిపల్​ పాలకులు దొంగ బిల్లులు పెట్టి రూ.లక్షలు కాజేస్తున్నారని బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ జీవీ నర్సింహారెడ్డి ఆరోపించారు. సోమవారం జరిగిన ఆర్మూర్​మున్సిపల్ మీటింగ్ ఏకపక్షంగా నిర్వహించారని, మీటింగ్ లో జమా ఖర్చులు చూపించడం లేదని, గతంలో వాయిదా పడిన మీటింగ్ లు తిరిగి నిర్వహించకపోవడాన్ని నిరసిస్తూ మున్సిపల్ ఆఫీస్ ముందు బీజేపీ లీడర్లు నిరసన తెలిపారు. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను బాగు చేయాలని కోరితే సీఎం కేసీఆర్ తీర్మానం చేసిన తర్వాత వేస్తామని చెప్పడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.

దశాబ్ది ఉత్సవాల పేరిట మున్సిపల్​ డీఈకి అడ్వాన్స్ పేమెంట్​ చేసినట్లే, మొరం వేసేందుకు అడ్వాన్స్ పేమెంట్​ చేయాలన్నారు. జనరల్ ఫండ్ మీద కలెక్టర్ విచారణకు ఆదేశించాలని, ఆర్మూర్ లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. కౌన్సిలర్లు ఆకుల సంగీత, కొంతం మంజుల, బ్యావత్ సాయికుమార్, మురళి పాల్గొన్నారు.