ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాడ్వాయి మేడారం తిరుగువారం పండుగకి వెళ్తుండగా.. అదుపుతప్పి బొలెరో వాహనం బోల్తాపడింది. ఈ ఘటనలో 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు వెంటనే గాయాలైన వారిని ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల గ్రామస్తులుగా గుర్తించారు.
మేడారంలోని సమ్మక్క, కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయాల్లో ఇవాళ బుధవారం తిరుగువారం పండుగ జరుగుతోంది. మహాజాతర ముగిసిన వారం రోజుల తర్వాత తిరుగువారం జరపడం ఆనవాయితీ. పూజారులు ఆలయాలను శుద్ధి చేసి, దీపాలు వెలిగించి, యాటను నైవేద్యంగా సమర్పించనున్నారు. పూజారుల కుటుంబసభ్యులు, ఆదివాసీలు, గిరిజనేతరులు అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకోనున్నారు.
►ALSO READ | వీడియో : కాంగ్రెస్ లో చేరిన చెన్నూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్
అనంతరం పూజా సామగ్రి, వస్త్రాలను ఆలయాల్లో భద్రపరుస్తారు. తిరుగువారంతో మహాజాతర కార్యక్రమాలన్నీ ముగుస్తాయి. మహబూబ్ బాద్ జిల్లా గంగారాం మండలం పునుగొడ్ల లో పగిడిగిద్దె రాజు తిరుగు వారం పండుగ జరగనుంది. ఆదివాసీ సంస్కృతి, సాంప్రదాయాల ప్రకారం పూజారులు మూడు రోజుల పాటు పండుగ జరుపుకోనున్నారు..
