కాంగ్రెస్ నేతలు కూడా నన్ను సంప్రదించిన్రు

కాంగ్రెస్ నేతలు కూడా నన్ను సంప్రదించిన్రు

తాను ఏ పార్టీలో చేరేది త్వరలోనే ప్రకటిస్తానని బూర నర్సయ్య గౌడ్ స్పష్టంచేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా తనను సంప్రదించారని తెలిపారు. ‘‘నేను పదవుల కోసం పనిచేసే వ్యక్తిని కాదు..ఏ పార్టీలో ఉన్నా ప్రజల కోసమే పని చేస్తా’’ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో, టీఆర్ఎస్ లో బీసీలకు ఎటువంటి అన్యాయం జరుగుతోందో  త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తానని ఆయన వ్యాఖ్యానించారు.  హైదరాబాద్ కు బయలుదేరే ముందు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. 

‘‘టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలనే నిర్ణయాన్ని నేను ఒకరోజులో తీసుకోలేదు. నేను చాలా నెలలు, వారాలుగా నిద్రలేని రాత్రులు గడిపాను. పార్టీ అధినాయకుడిని (కేసీఆర్ ను) కలిసే అవకాశమే లేనప్పుడు .. అక్కడ ఇంకా ఏం చేయాలనే ప్రశ్న నన్ను వెంటాడింది. కేసీఆర్ అనే పేరు ముఖ్యమంత్రి కంటే పెద్దది. నేను పదవులు, పైరవీల కోసం టీఆర్ఎస్ లో పనిచేయలేదు. కేసీఆర్ దయచేసి  ప్రేమను చంపుకోకండి.. ప్రేమతో నాయకులను కలవండి.. మాట్లాడండి.. కలుపుకోండి.. అదే వంద కోట్ల రూపాయలు ఇచ్చిన దానితో సమానం.డబ్బు, అధికారం, ప్రతీకారం, పగలను నమ్ముకోవడం మంచిది కాదు’’ అని బూర నర్సయ్య గౌడ్  కామెంట్ చేశారు.   

ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన బూర నర్సయ్య గౌడ్ నిన్న రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డాలను కలిశారు. ఆయన ఇవాళ సాయంత్రం 5 గంటలకు హస్తిన నుంచి హైదరాబాద్ కు బయల్దేరనున్నారు. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా భువనగిరికి చేరుకుని అక్కడ ముఖ్య నాయకులతో  ఇవాళ రాత్రి  సమావేశం కానున్నారు. ఈ నెల 28 లేదా 29న మునుగోడులో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభలోనే బూర నర్సయ్య గౌడ్ కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఈ నెల 30న సీఎం కేసీఆర్ సభ ఉండటంతో.. అంతకు ముందే సభ నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. దీనికి చీఫ్ గెస్ట్​గా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​ను ఆహ్వానించాలని ప్లాన్​ చేస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ సీఎం కేసీఆర్ కు బూర నర్సయ్యగౌడ్ లేఖ పంపారు. 2009 నుంచి తెలంగాణ ఉద్యమం, పార్టీ ప్రస్థానంపై లేఖలో ప్రస్తవించారు .2019లో ఎంపీగా ఓడిన తర్వాత చాలా అవమానాలు ఎదుర్కొంటున్నానని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో బూర నర్సయ్య గౌడ్ క్రియాశీలక పాత్ర పోషించారు. 2013 సంవత్సరంలో టీఆర్‌ఎస్‌లో చేరిన ఆయన.. 2014 లోక్ సభ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2019లో జరిగిన  లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు.