తెలంగాణ ఆలయాలకు కేంద్రం నిధులు

తెలంగాణ ఆలయాలకు కేంద్రం నిధులు

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పిలిగ్రిమేజ్ రిజువెనేషన్ అండ్ స్పిరిచ్యువల్ ఆగ్మెంటేషన్ డ్రైవ్ ప్రసాద్ స్కీమ్ తో రాష్ట్రంలో టెంపుల్ టూరిజం మరింత అభివృద్ధి చెందుతోంది. దక్షిణ కాశీగా పేరొందిన అలంపూర్ లోని జోగులాంబ శక్తి పీఠం రెండేండ్ల కిందటే ఈ స్కీమ్ కింద ఎంపిక కాగా.. ఈ ఏడాది రామప్పలోని రామలింగేశ్వరాలయం, భద్రాచలంలోని రామాలయం సెలక్టయ్యాయి. అలంపూర్ లో అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ రూ.80 కోట్లతో ప్రపోజల్స్ పంపగా.. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రూ.50 కోట్లు విడుదల చేసింది. రామప్పలో కామేశ్వర ఆలయం పునరుద్ధరణ, ఇతర అభివృద్ధి పనుల కోసం రూ.62 కోట్లతో అధికారులు ప్రతిపాదనలు పంపారు.భద్రాచలంలో రూ.61 కోట్ల విలువైన పనుల కోసం ప్రపోజల్స్ పంపగా... కేంద్రం 41 కోట్లు రిలీజ్ చేసింది.

యునెస్కో కండిషన్

యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయానికి ఏడాదిగా భక్తులు, టూరిస్టుల రద్దీ భారీగా పెరిగింది. గుర్తింపును నిలబెట్టుకోవాలంటే ఆలయ పరిసరాల్లోని కామేశ్వర ఆలయాన్ని పునరుద్ధరించాల్సి ఉంటుందని యునెస్కో అప్పట్లోనే కండిషన్ పెట్టింది. దీంతో తొలి ప్రాధాన్యతగా ఈ ఆలయ పునరుద్ధరణ పనులు చేపట్టనున్నారు. దీంతో పాటు మిగతా అనుబంధ ఆలయాలనూ డెవలప్ చేయాల్సి ఉంటుంది. టూరిస్టుల వెహికిల్ పార్కింగ్ ఫెసిలిటీ, ఆలయం చుట్టూ విశాలమైన లాన్, గెస్ట్ హౌస్ లు, ప్రైమరీ హెల్త్ సెంటర్, సీసీ కెమెరాల ఏర్పాటు, ఆలయం నుంచి పాలంపేట గ్రామం వరకు రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్, టాయిలెట్లు, హరిత హోటళ్ల విస్తరణ, తాగునీరు, క్యూలైన్ వంటి ఏర్పాట్లు, మ్యూజియం, శిల్పారామం వంటి ప్రతిపాదనలతో డీపీఆర్ ను రాష్ట్ర టూరిజం అధికారులు కేంద్రానికి పంపారు. ఈ పనులన్నీ పూర్తయితే రామప్ప మరింత అందంగా ముస్తాబు కానుంది.

కేంద్రం నుంచి రూ.41 కోట్లు రిలీజ్

రామాయణ సర్య్యూట్ లో భాగంగా భద్రాచలం ఆలయం, అనుబంధ ఆలయాలు, ప్రదేశాల అభివృద్ధి కోసం రూ.61 కోట్ల విలువైన పనులతో రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ కేంద్రానికి ప్రపోజల్స్ పంపింది. దీనికి తొలి విడతగా రూ.41 కోట్లు కేంద్రం రిలీజ్ చేసింది. కేంద్రానికి పంపిన ప్రపోజల్స్ లో పర్ణశాల, నిత్య కల్యాణ మండపం, హనుమాన్ టెంపుల్, మిథిలా స్టేడియంలో అభివృద్ది పనులు, 10 బ్యాటరీ కార్లు, గోదావరి బ్రిడ్జి సమీపంలో కాటేజీలు, టాయిలెట్లు, బాత్రూమ్ లు, పార్కుతో పాటు వివిధ పనులున్నాయి. సీతారామచంద్రస్వామి ప్రసాదాల తయారీ కేంద్రం కోసం కొత్త మెషినరీ కొనుగోలు చేయనున్నారు. కాగా, రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధితో పాటు టూరిజం డెవపల్ మెంట్ కోసం కేంద్ర సర్కార్ అన్ని రకాలుగా సహకరిస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే నిధులు మంజూరు చేశామన్నారు. మిగతా ప్రతిపాదనలతో త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.