వెలుగు, బిజినెస్డెస్క్: బావగుతు రఘురామ్ షెట్టి(బీఆర్ షెట్టి)… లగ్జరీ లైఫ్కు పెట్టింది పేరు. ఈయన ఎక్కడికి వెళ్లాలన్నా ప్రైవేట్ జెట్లోనే ప్రయాణం… దుబాయ్లోని అత్యంత కాస్ట్లీ భవనం బుర్జ్ ఖలిఫాలో రెండు అంతస్తులు పూర్తిగా ఈయన సొంతమే. రాజకీయవేత్తలు, బాలీవుడ్లో పై స్థాయి వారితోనే ఈయన పరిచయాలు. ఒకప్పుడు రారాజుగా వెలిగిపోయాడు. ఇది వెనకటి సంగతి.. ఇప్పుడు సీన్ ఏంటంటే.. ఈ బీఆర్ షెట్టి ఆస్తులు ఒక్కసారిగా కుప్పకూలాయి. బిలీనియర్ స్థాయి నుంచి మిలీనియర్ స్థాయికి పడిపోయాడు. ఆయన దర్జా దర్పం అంతా నకిలీనే అని తేలింది.
లగ్జరీ లైఫ్ స్టయిల్ను అనుభవించేందుకు ఆయన కనికట్టు చేశాడు. తన దగ్గర మస్తు ఆస్తులున్నట్టు షెట్టి రకరకాల డాక్యుమెంట్లు తయారు చేసి అందరికి చూపించుకున్నాడు. ఆయన ఆటలకు కార్సన్ బ్లాక్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ మడ్డీ వాటర్స్ చెక్ పెట్టింది. షెట్టి సంస్థ ఎన్ఎంసీ హెల్త్ పీఎల్సీ అకౌంట్లలో తారు మారు జరిగిందని పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. దీంతో బీఆర్ షెట్టికి ఎదురుదెబ్బ తగిలింది. మడ్డీ వాటర్స్ పబ్లిక్ కంపెనీల్లో ఇన్వెస్టిగేటివ్ రీసెర్చ్ చేస్తోంది. వారి ఇన్వెస్ట్మెంట్ పొజిషన్లను కూడా అనాలసిస్ చేస్తోంది. కంపెనీల్లో మోసాలను ఇది బయటికి తీస్తుంది.
బ్లాక్స్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ మడ్డీ వాటర్స్ ఎన్ఎంసీ అకౌంట్లపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఎన్ఎంసీ తన బ్యాలెన్స్ షీటును తారుమారు చేసిందని, తాను కొన్న కంపెనీల విలువను పెంచి చూపించిందని మడ్డీ వాటర్స్ కనుగొనింది. ఈ అకౌంట్లపై స్క్రుటినీ కూడా స్టార్ట్ చేసింది. మడ్డీ వాటర్స్ స్క్రుటినీ పెంచడంతో, ఇంకా చాలా విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. షెట్టి షేర్ అరేంజ్మెంట్స్, ఆయన సంపదపై కూడా మడ్డీ వాటర్స్ అనుమానాలు వ్యక్తం చేసింది. దీంతో ఆయన హెల్త్ సంస్థ ఎన్ఎంసీలో, ఫైనాన్సియల్ సర్వీసెస్ సంస్థ ఫినాబ్లర్ పీఎల్సీలో ఆయనకున్న వాటాల విలువ భారీగా తగ్గిపోయింది. ఈ కంపెనీల్లో ఒకప్పుడు ఆయనకున్న వాటాల విలువ 2.4 బిలియన్ డాలర్లుగా ఉండేది. షెట్టి సంపదపై అనుమానాలు వ్యక్తం కావడంతో, ఈయన సంపద ఒక్కసారిగా 885 మిలియన్ డాలర్లకు పడిపోయింది.
67 శాతం వరకు కుప్పకూలిన షేర్లు…
న్యాయ సంస్థ హెర్బర్ట్ స్మిత్ ఫ్రీహిల్స్ కూడా కంపెనీలో షెట్టి హోల్డింగ్స్పై రివ్యూ చేయడం ప్రారంభించింది. ఎన్ఎంసీ ఆస్తుల కోసం ఎక్కువ పేమెంట్స్ చేశారని, రుణాలను తక్కువ చేసి చూపించారని మడ్డీ వాటర్స్ పేర్కొంది. యూఏఈలో అతిపెద్ద హెల్త్కేర్ ప్రొవైడర్ అయిన ఈ కంపెనీ షేర్లు ఇప్పటి వరకు 67 శాతం పతనమయ్యాయి. ఈ సంస్థపై ఇప్పుడు టేకోవర్ ఊహాగానాలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ కంపెనీ షేర్ల అమ్మకాల సెగ మరో గ్రూప్ కంపెనీ ఫినాబ్లర్కు కూడా తాకింది. దీని స్టాక్ కూడా 64 శాతం వరకు పడిపోయింది. లోకల్ రెగ్యులేటర్స్ కూడా ఈ కంపెనీలు, వీటి సంబంధిత పార్టీలపై విచారణలు కూడా చేపట్టాయని ఎన్ఎంసీ అధికార ప్రతినిధి యూకే ఫైనాన్సియల్ కండక్ట్ అథారిటీకి చెప్పారు. మడ్డీ వాటర్స్ రిపోర్ట్ వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఎన్ఎంసీ షేర్లు పడుతూనే ఉన్నాయి. దీంతో షెట్టి అల్ట్రా రిచ్ పర్సన్ నుంచి కిందకు జారిపోతున్నాడు.
అన్నీ నిరాధార ఆరోపణలే….
మడ్డీ వాటర్స్ తనపై, ఇతర కంపెనీలపై నిరాధార ఆరోపణలు చేస్తోందని షెట్టి అంటున్నాడు. గతనాలుగేళ్లుగా షెట్టి తన కంపెనీలో యాక్టివ్ మేనేజ్మెంట్లో లేరు.
ఉడుపి నుంచి దుబాయ్ వరకు..
ఎన్ఎంసీ యునిటెడ్ అరబ్ ఎమిరేట్స్లో అతిపెద్ద మెడికల్ నెట్వర్క్ను నిర్వహిస్తోంది. 2012లో లండన్లో లిస్ట్ అయిన తొలి అబుదాబి కంపెనీగా కూడా పేరులోకి వచ్చింది. ఉడుపిలో 1942లో జన్మించిన బీఆర్ షెట్టి అబుదాబి వెళ్లిన తర్వాత ఈ మెడికల్ నెట్వర్క్ను 1975లో ఏర్పాటు చేశాడు. అంతేకాక రెండేళ్ల క్రితం లండన్ లిస్టెడ్ పేమెంట్స్ కంపెనీ ఫినాబ్లర్ను స్థాపించాడు. ఫార్మాస్యూటికల్ మాన్యుఫాక్చరర్ నియో ఫార్మాను ఏర్పాటు చేశాడు. ఇండియా, నేపాల్, ఆఫ్రికా, గల్ఫ్లో ఉన్న హెల్త్కేర్ ఫార్మా బీఆర్ లైఫ్ కూడా షెట్టిదే. షెట్టి ఫార్మా సేల్స్మాన్గా కూడా పనిచేశాడు. 1973లో యూఏఈ వెళ్లిన తర్వాత, ఫార్మసీలో క్లినికల్ డిగ్రీ పొందాడు. 2017లో ఫిల్మ్ మేకింగ్ వ్యాపారాల్లో అడుగుపెట్టిన షెట్టి, అంతగా సక్సెస్ సాధించలేకపోయాడు. దుబాయ్, అబుదాబి, లండన్, పెర్త్, బెంగళూరు, మంగళూరు, ఉడిపి లో రెసిడెన్షియల్ బిల్డింగ్స్, వింటేజ్ కార్లు ఆయనకున్నాయి. షెట్టి తన కెరీర్ను మున్సిపల్ కౌన్సిల్లో వైస్ ఛైర్మన్గా ప్రారంభించాడు. 2019లో ఫోర్బ్స్ లెక్కల ప్రకారం ఆయన ఇండియాలో 42వ ధనికుడిగా చోటు దక్కించుకున్నాడు. అంతేకాక షెట్టికి పద్మశ్రీ పురస్కారం కూడా దక్కింది.
