
- మిసైల్ యూనిట్ ఏర్పాటయ్యే అవకాశం
- తాజాగా దేవరకద్ర ఏరియాలో డిఫెన్స్ ఆఫీసర్ల పర్యటన
- అందుబాటులో 400 ఎకరాల ప్రభుత్వ భూమి
- ఏర్పాటైతే 8 వేల మందికి ఉపాధి అవకాశాలు
మహబూబ్నగర్, వెలుగు : తెలంగాణలో బ్రహ్మోస్ మిసైల్ తయారీ యూనిట్, డిఫెన్స్ కారిడార్ఏర్పాటు కాబోతోంది. దీనిపై ఇప్పటికే కేంద్రం నుంచి అనుమతి వచ్చింది. అయితే.. ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై స్పష్టత లేదు. మహబూబ్నగర్ జిల్లాలో ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్రెడ్డి.. బ్రహ్మోస్ జనరల్ డైరెక్టర్, డీఆర్డీవో ఆఫీసర్లను కోరారు. దీంతో డీఆర్డీవో ఆఫీసర్లు దేవరకద్రలో పర్యటించారు.
ఇక్కడ ఏర్పాటుకు వాతావరణం అనుకూలంగా ఉన్నట్లు ఆఫీసర్లు స్పష్టం చేసినట్లు తెలిసింది. మొదట హైదరాబాద్ప్రాంతంలో ఏర్పాటు చేయాలని భావించగా.. అక్కడ పెద్ద మొత్తంలో ప్రభుత్వ భూములు అందుబాటులో లేవు. ప్రైవేట్భూములున్నా రూ. కోట్లల్లో ధర ఉంది. దీంతో రాష్ట్ర సర్కార్ ప్రత్యామ్నాయ ఆలోచన చేసింది. యూనిట్ కోసం దాదాపు 350 నుంచి 400 ఎకరాల భూమి కావాల్సి ఉంటుందని అంచనా వేసింది.
హైదరాబాద్, శంషాబాద్ఎయిర్పోర్ట్కు దగ్గరలో బెంగళూరుకు నేషనల్ హైవే-– -44 రోడ్డు కనెక్టివిటీ ఉన్నా మహబూబ్నగర్ జిల్లాలో సెంటర్ ఏర్పాటు చేయాలని సూచించింది. బ్రహ్మోస్ జనరల్ డైరెక్టర్ జైతీర్థ్ జోషి, బ్రహ్మోస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్. సాంబశివ ప్రసాద్, డిఫెన్స్ రీసెర్చ్అండ్డెవలప్మెంట్ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) డైరెక్టర్ జీఏ శ్రీనివాస్మూర్తి గత గురువారం దేవరకద్ర సెగ్మెంట్ లోని చౌదర్పల్లి – బస్వాయ్పల్లి గ్రామాలను సందర్శించారు.
వీరి వెంట జిల్లాకు చెందిన డీసీసీ అధ్యక్షుడు, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి, తహసీల్దార్ కృష్ణయ్య ఉన్నారు. రెండు గ్రామాల్లో దాదాపు 400 ఎకరాల ప్రభుత్వ భూమిని చూపించారు. అక్కడ భూముల పరిస్థితులపై మ్యాప్ ద్వారా తహసీల్దార్ వివరించగా.. డిఫెన్స్ ఆఫీసర్లు సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం అందుబాటులోని 400 ఎకరాలతో పాటు మరో 100 ఎకరాలు కూడా అవసరం ఉంటుందని ఎమ్మెల్యే, తహసీల్దా ర్కు ఆఫీసర్లు చెప్పినట్లు, అది కూడా అందుబాటులో ఉన్నట్లు వివరించినట్లు తెలిసింది. దాదాపు రెండు సెంటర్లను ఇక్కడే స్థాపించే అవకాశాలు వంద శాతం ఉన్నట్లు డిఫెన్స్ అధికారులు పేర్కొన్నట్లు
తెలిసింది.
రాష్ట్రానికి మూడో డిఫెన్స్ కారిడార్
ఇప్పటికే యూపీ, తమిళనాడులో రెండు డిఫెన్స్ కారిడార్లు ఉండగా.. తెలంగాణలో ఏర్పాటైతే మూడోది కానుంది. ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా కేంద్రప్రభుత్వం రక్షణ రంగంలోనూ దేశీయంగా తయారైన వస్తువులనే వాడాలని నిర్ణయించింది. ఇందుకు భారీగా నిధులు కూడా కేటాయిస్తుంది. అదేవిధంగా మరో డిఫెన్స్ కారిడార్ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. తెలంగాణలో మెరుగైన రోడ్డు రవాణా వ్యవస్థతో పాటు నేషనల్హైవే కనెక్టివిటీ ఎక్కువగా ఉండడంతో కొత్త కారిడార్ ను కేటాయించింది. ఇక్కడ ఏర్పాటు చేయడం ద్వారా ఇండియన్ మేడ్తో డిఫెన్స్, స్పేస్ పరికరాలు, సంబంధిత విడి భాగాలు తయారు చేస్తారు.
ప్రపంచ పటంలోకి ఎక్కనున్న దేవరకద్ర
జిల్లాకు కేంద్ర రక్షణ సెంటర్ రావడం ద్వారా దేవరకద్ర ప్రపంచ పటంలోకి ఎక్కనుంది. దాదాపు 400 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు కొద్దిరోజుల కింద ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లా. వెంటనే బ్రహ్మోస్, డీఆర్డీవో ఆఫీసర్లతో సమావేశమై వివరించారు. సీఎం సూచనలతో ఆఫీసర్లు వచ్చి భూమిని పరిశీలించారు. ఇక్కడి వాతావరణం కూడా బాగుందని అన్నారు. ఇక్కడే ఏర్పాటు చేస్తారనే నమ్మకం ఉంది. బ్రహ్మోస్ మిసైల్ అనుబంధ పరికరాల తయారీతో పాటు డిఫెన్స్ కారిడార్ను ఏర్పాటు చేసేందుకు త్వరలోనే విధి విధానాలు వస్తాయి. రెండు కేంద్రాలు ఏర్పాటైతే దాదాపు 6 వేల నుంచి 8 వేల మందికి ఉపాధి లభిస్తుంది. - జి.మధుసూదన్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే