పాలమూరుకు బ్రహ్మోస్ ! దేశంలోనే మూడో డిఫెన్స్ కారిడార్..

పాలమూరుకు బ్రహ్మోస్ ! దేశంలోనే మూడో డిఫెన్స్ కారిడార్..
  • మిసైల్ యూనిట్ ఏర్పాటయ్యే అవకాశం
  • తాజాగా దేవరకద్ర  ఏరియాలో డిఫెన్స్ ఆఫీసర్ల పర్యటన 
  • అందుబాటులో 400 ఎకరాల ప్రభుత్వ భూమి 
  • ఏర్పాటైతే  8 వేల మందికి ఉపాధి అవకాశాలు

మహబూబ్​నగర్, వెలుగు : తెలంగాణలో బ్రహ్మోస్ ​మిసైల్ తయారీ యూనిట్, డిఫెన్స్​ కారిడార్​ఏర్పాటు కాబోతోంది. దీనిపై ఇప్పటికే  కేంద్రం నుంచి అనుమతి వచ్చింది. అయితే.. ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై స్పష్టత లేదు. మహబూబ్​నగర్​ జిల్లాలో ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్​రెడ్డి..  బ్రహ్మోస్​ జనరల్ డైరెక్టర్, డీఆర్డీవో ఆఫీసర్లను కోరారు.  దీంతో  డీఆర్డీవో ఆఫీసర్లు దేవరకద్రలో పర్యటించారు.

ఇక్కడ ఏర్పాటుకు వాతావరణం అనుకూలంగా ఉన్నట్లు ఆఫీసర్లు స్పష్టం చేసినట్లు తెలిసింది. మొదట హైదరాబాద్​ప్రాంతంలో ఏర్పాటు చేయాలని భావించగా.. అక్కడ పెద్ద మొత్తంలో ప్రభుత్వ భూములు అందుబాటులో లేవు. ప్రైవేట్​భూములున్నా రూ. కోట్లల్లో ధర ఉంది. దీంతో రాష్ట్ర సర్కార్ ప్రత్యామ్నాయ ఆలోచన చేసింది. యూనిట్ కోసం దాదాపు 350 నుంచి 400 ఎకరాల భూమి కావాల్సి ఉంటుందని అంచనా వేసింది.

హైదరాబాద్, శంషాబాద్​ఎయిర్​పోర్ట్​కు దగ్గరలో బెంగళూరుకు నేషనల్ ​హైవే-– -44 రోడ్డు కనెక్టివిటీ ఉన్నా మహబూబ్​నగర్ ​జిల్లాలో  సెంటర్ ఏర్పాటు చేయాలని సూచించింది.  బ్రహ్మోస్ జనరల్ డైరెక్టర్  జైతీర్థ్ జోషి, బ్రహ్మోస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్​. సాంబశివ ప్రసాద్, డిఫెన్స్​ రీసెర్చ్​అండ్​డెవలప్​మెంట్​ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) డైరెక్టర్ ​జీఏ శ్రీనివాస్​మూర్తి గత గురువారం దేవరకద్ర సెగ్మెంట్ లోని చౌదర్​పల్లి –  బస్వాయ్​పల్లి గ్రామాలను సందర్శించారు.

వీరి వెంట జిల్లాకు చెందిన డీసీసీ అధ్యక్షుడు, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్​రెడ్డి, తహసీల్దార్​ కృష్ణయ్య ఉన్నారు. రెండు గ్రామాల్లో దాదాపు 400 ఎకరాల ప్రభుత్వ భూమిని చూపించారు. అక్కడ భూముల పరిస్థితులపై మ్యాప్​ ద్వారా తహసీల్దార్​ వివరించగా.. డిఫెన్స్ ఆఫీసర్లు సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం అందుబాటులోని 400 ఎకరాలతో పాటు మరో 100 ఎకరాలు కూడా అవసరం ఉంటుందని ఎమ్మెల్యే, తహసీల్దా ర్​కు ఆఫీసర్లు చెప్పినట్లు, అది కూడా అందుబాటులో ఉన్నట్లు వివరించినట్లు తెలిసింది. దాదాపు రెండు సెంటర్లను ఇక్కడే స్థాపించే అవకాశాలు వంద శాతం ఉన్నట్లు డిఫెన్స్ అధికారులు పేర్కొన్నట్లు 
తెలిసింది.  

రాష్ట్రానికి మూడో డిఫెన్స్​ కారిడార్​

ఇప్పటికే యూపీ, తమిళనాడులో రెండు డిఫెన్స్​ కారిడార్లు ఉండగా.. తెలంగాణలో ఏర్పాటైతే మూడోది కానుంది. ‘మేక్​ ఇన్​ ఇండియా’లో భాగంగా కేంద్రప్రభుత్వం రక్షణ రంగంలోనూ దేశీయంగా తయారైన వస్తువులనే వాడాలని నిర్ణయించింది. ఇందుకు భారీగా నిధులు కూడా కేటాయిస్తుంది. అదేవిధంగా  మరో డిఫెన్స్​ కారిడార్​ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. తెలంగాణలో మెరుగైన రోడ్డు రవాణా వ్యవస్థతో పాటు నేషనల్​హైవే కనెక్టివిటీ ఎక్కువగా ఉండడంతో కొత్త కారిడార్ ను కేటాయించింది. ఇక్కడ ఏర్పాటు చేయడం ద్వారా ఇండియన్ మేడ్​తో డిఫెన్స్, స్పేస్ ​పరికరాలు, సంబంధిత విడి భాగాలు తయారు చేస్తారు.

ప్రపంచ పటంలోకి ఎక్కనున్న దేవరకద్ర 

జిల్లాకు కేంద్ర రక్షణ సెంటర్ రావడం ద్వారా దేవరకద్ర ప్రపంచ పటంలోకి ఎక్కనుంది. దాదాపు 400 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు కొద్దిరోజుల కింద ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి దృష్టికి తీసుకెళ్లా. వెంటనే బ్రహ్మోస్, డీఆర్డీవో ఆఫీసర్లతో సమావేశమై వివరించారు. సీఎం సూచనలతో ఆఫీసర్లు వచ్చి భూమిని పరిశీలించారు. ఇక్కడి వాతావరణం కూడా బాగుందని అన్నారు. ఇక్కడే ఏర్పాటు చేస్తారనే నమ్మకం ఉంది. బ్రహ్మోస్​ మిసైల్​ అనుబంధ పరికరాల తయారీతో పాటు డిఫెన్స్​ కారిడార్​ను ఏర్పాటు చేసేందుకు త్వరలోనే విధి విధానాలు వస్తాయి. రెండు కేంద్రాలు ఏర్పాటైతే దాదాపు 6 వేల నుంచి 8 వేల మందికి ఉపాధి లభిస్తుంది.  - జి.మధుసూదన్​ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే