బాన్సువాడ డిపోలో డ్రైవర్లు రమేష్, షరీఫుద్దీన్లకు డ్యూటీ ఎక్కే ముందు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేశారు. ఇద్దరికి వరుసగా 20 ఎంజీ/100 ఎంఎల్, 4 ఎంజీ/ 100ఎంఎల్ అని చూపించింది. వీరు నిజానికి మద్యం తాగలేదు. వీరి విజ్ఞప్తి మేరకు పోలీసులు వచ్చి వారి దగ్గరున్న బ్రీత్ ఎనలైజర్ మిషన్తో చెక్చేయగా ‘జీరో’ చూపించింది. అంటే మద్యం తాగలేదన్నమాట. కానీ అధికారులు ఆర్టీసీ డిపోలో ఉన్న దాని రీడింగ్ ప్రకారం మద్యం తాగారంటూ డ్యూటీకి అనుమతించలేదు. ఇదే పరిస్థితి రాష్ట్రంలోని అన్ని డిపోల్లోనూ ఉంది.
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీలో ప్రతి డ్రైవర్ డ్యూటీ ఎక్కేముందు మద్యం తాగారో లేదో బ్రీత్ ఎనలైజర్తో చెక్ చేస్తారు. ఏళ్లుగా ఇది సాగుతోంది. అయితే ఆర్టీసీలో వాడుతున్న బ్రీత్ ఎనలైజర్లు ఏళ్లనాటివి. సరిగా రీడింగ్ చూపించకపోవడంలో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు. మోటార్ వెహికిల్ యాక్ట్ ప్రకారం 30ఎంజీ దాటితేనే చర్యలు తీసుకోవాలి. 10-30 ఎంజీ ఉంటే ఆ రోజు డ్యూటీ చేయనీయరు. ఎలాంటి చార్జీషీట్స్ ఇవ్వకూడదు. కానీ ఆర్టీసీ అధికారులు ఆల్కహాల్ పర్సంటేజ్ 4 ఎంజీ ఉన్నా విధుల్లోకి అనుమతించడంలేదు. పైగా చర్యలు తీసుకుంటున్నారు. బయట పోలీసులు 30 ఎంజీ కంటే ఎక్కువుంటేనే కేసులు బుక్ చేస్తుంటారు. మెంతోప్లస్, పిప్పర్మెంట్, జర్దా, పాన్పరాగ్, దగ్గు మందు, హోమియో మాత్రలు వేసుకున్నా ఆర్టీసీ బ్రీత్ ఎనలైజర్లలో 4 ఎంజీ చూపిస్తోందని కార్మికులు వాపోతున్నారు. చాలా కేసుల్లో పోలీసులు వాడుతున్న పరికరాలతో మరోమారు టెస్టులు చేయిస్తే ‘జీరో’ రీడింగ్ వస్తోందని వాపోతున్నారు. అధికారుల తీరుపై ఆర్టీసీ డ్రైవర్లు, కార్మిక సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సస్పెన్షన్లు, మెమోలు జారీ చేస్తూ మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని మండిపడుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇవీ చర్యలు
ఇటీవల పదుల సంఖ్యలో డ్రైవర్లపై అధికారులు చర్యలు తీసుకున్నారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ డిపోలో ఇలాగే ఇద్దరు డ్రైవర్లను సస్పెండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా ఉప్పల్ డిపోలో ఐదుగురికి చార్జ్ మెమోలు ఇచ్చారు. కరీంనగర్ డిపోలోనూ ముగ్గురు డ్రైవర్లను తాత్కాలికంగా విధుల్లోంచి తీసేశారు. ఆదిలాబాద్ జిల్లాలో 10 మంది, నల్గొండ జిల్లాలో 9 మంది, నిజామాబాద్ జిల్లాలో ఏడుగురు, వరంగల్ జిల్లాలో ఐదుగురు డ్రైవర్లపైనా చర్యలు తీసుకున్నారు.