Impact Player Rule: 2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఎన్నో కొత్త ప్రయోగాలను చేసింది. ఈ టోర్నమెంట్ యొక్క లక్ష్యం క్రికెట్ ని మరింత ఉత్కంఠభరితంగా మార్చడం, ప్లేయర్స్ కే కాకుండా అభిమానులకు కూడా కొత్త అనుభూతిని అందించడం. కాలక్రమేణా ఐపీఎల్లో పలు కొత్త రూల్స్ ప్రవేశ పెడుతున్నారు. అలాంటి మార్పుల్లో ముఖ్యమైనది 2023లో తీసుకొచ్చిందే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్. ఈ నియమం ఐపీఎల్లో బ్యాటింగ్ తీరు, మ్యాచ్ వ్యూహాలను పూర్తిగా మార్చివేసింది. ఒకవైపు ఈ నియమం మ్యాచ్లో ఉత్కంఠను పెంచగా, మరోవైపు క్రికెట్ సంప్రదాయ సమతౌల్యంపై చర్చలకు దారితీసింది.
ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అంటే ఏమిటి?:
సాధారణంగా చెప్పాలంటే ఈ రూల్ ప్రకారం ఒక జట్టు మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక ఆటగాడిని మరొకరితో మార్చుకోవచ్చు. అంటే బ్యాటర్ స్థానంలో బౌలర్ను లేదా బౌలర్ స్థానంలో బ్యాటర్ను తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా జట్లు మొదట అదనపు బ్యాటర్తో మ్యాచ్ ప్రారంభించి, ఆ తర్వాత బౌలింగ్ సమయంలో ప్రత్యేక బౌలర్ను తీసుకుంటున్నాయి. దీంతో జట్లకు బ్యాటింగ్ లోతు పెరిగి, వ్యూహాత్మకంగా మ్యాచ్ను మలచుకునే ఛాన్స్ కలుగుతుంది. ఈ నియమం కారణంగా ఒకప్పుడు టీ20 జట్లలో కీలక పాత్ర పోషించిన ఆల్రౌండర్ల ప్రాముఖ్యత కొంత తగ్గిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇప్పుడు అన్ని టీమ్స్ ఆల్ రౌండర్లపై ఆధారపడకుండా, అవసరానికి అనుగుణంగా స్పెషలిస్ట్ ఆటగాళ్లను ఉపయోగించుకుంటున్నాయి.
విరాట్ కోహ్లీ అభిప్రాయం:
ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ విమర్శలు చేసిన ప్రముఖ ప్లేయర్స్ లో ఒకరు విరాట్ కోహ్లీ, ఈ నియమం కారణంగా బౌలర్లకు చాలా కష్టంగా మారిందని చెప్పారు. ఈ ఐపీఎల్లో వినోదం ఒక వైపు ఉంటే, బౌలర్లు పరుగులు ఎలా నియంత్రించాలా అని ఆలోచిస్తున్నారు. ప్రతి బంతికి ఫోర్ లేదా సిక్స్ కొట్టాలని బ్యాటర్లు ట్రై చేసే పరిస్థితి కనిపిస్తోందని కోహ్లీ అన్నారు. పవర్ప్లేలో తాను 200+ పైగా స్ట్రైక్రేట్తో ఆడటానికి కూడా ఈ అదనపు బ్యాటర్ కారణమని ఆయన వివరించారు. టీంలో ఎనిమిదో స్థానంలో కూడా ఒక బ్యాటర్ ఉన్నాడని తెలుసుకున్నప్పుడు బ్యాటర్లు మరింత దూకుడుగా ఆడతారని పేర్కొన్నారు. క్రికెట్లో అసలు ఉత్కంఠత అనేది బ్యాట్ అండ్ బాల్ మధ్య సమాన పోటీ ఉన్నప్పుడే వస్తుందని కోహ్లీ అభిప్రాయపడ్డారు. మొత్తంగా చూస్తే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఐపీఎల్లో ఆట తీరు మార్పుకు కారణమైనా, భవిష్యత్తులో క్రికెట్ సమతౌల్యంపై మరింత చర్చలకు దారితీసే అవకాశం ఉంది.
ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తో భారీగా మార్పులు:
* మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోరు పెరిగింది:
గతంలో సగటు స్కోరు 160–165 మధ్య ఉండగా, ఇటీవల అది 180+ పైగా ఉంటుంది.
* 200 పైగా స్కోర్లు పెరిగాయి:
ఒకప్పుడు 200 రన్స్ అంటే గెలుపు స్కోరుగా భావించేవారు. ఇప్పుడు అది నార్మల్ అయిపోయింది.
* రికార్డు స్కోర్లు పెరిగాయి:
ఇంపాక్ట్ ప్లేయర్ యుగంలో 260+ పైగా స్కోర్లు కూడా నమోదు అవుతున్నాయి.
రన్రేట్ పెరిగింది:
ఐపీఎల్లో సగటు రన్రేట్ ఇప్పుడు ఓవరుకు 9 రన్స్ దాటింది. గతంలో ఇది సుమారు 8 నుంచి 8.3 మధ్య ఉండేది.
పెరిగిన బౌలర్ల ఎకానమీ రేట్:
దూకుడైన బ్యాటింగ్ కారణంగా బౌలర్లు పరుగులు నియంత్రించడం చాలా కష్టంగా మారింది.
