నెతన్యాహు కొత్త వీడియో కూడా AI డీప్ ఫేక్ : గ్రోక్ రిజల్ట్ అంటూ సోషల్ మీడియా హల్ చల్

నెతన్యాహు కొత్త వీడియో కూడా AI డీప్ ఫేక్ : గ్రోక్ రిజల్ట్ అంటూ సోషల్ మీడియా హల్ చల్

ఇజ్రాయెల్ ప్రధాని బెన్జమిన్ నెతన్యాహు చనిపోయారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ పుకార్లకు చెక్ పెట్టేందుకు నెతన్యాహు స్వయంగా ఒక వీడియో విడుదల చేశారు. అయితే ఈ వీడియో అగ్నికి ఆజ్యం పోసినట్లుగా మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఆ వీడియోను పరిశీలించిన నెటిజన్లతో పాటుగా ఎక్స్ ప్లాట్‌ఫారమ్‌లోని ఏఐ చాట్‌బాట్ 'గ్రోక్' సైతం ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో సృష్టించిన 'డీప్‌ఫేక్' వీడియో అని తేల్చి చెప్పడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో నెతన్యాహు భద్రతపై నీలినీడలు కమ్ముకున్నాయి. గత వారమే ఆయనకు 6 వేళ్లు ఉన్నట్లు కనిపిస్తున్న ఒక వీడియో బయటకు రావడంతో ఆయన మరణించారనే వార్తలు వైరల్ అయ్యాయి. వీటన్నింటినీ కొట్టిపడేస్తూ.. నెతన్యాహు తాజాగా జెరూసలేం కొండల్లోని 'ది సటాఫ్' అనే కేఫ్ వద్ద కాఫీ ఆర్డర్ ఇస్తూ ఒక వీడియో షేర్ చేశారు. "మీరు చనిపోయారని వార్తలు వస్తున్నాయి" అని ఒకరు అడిగిన ప్రశ్నకు.. నేను కాఫీ కోసం చస్తున్నాను అంటూ వ్యంగ్యంగా సమాధానమిచ్చారు ఆ వీడియోలో. అంతేకాకుండా తన రెండు చేతులను కెమెరా ముందు చూపిస్తూ వేళ్లను లెక్కపెట్టుకోమంటూ సవాల్ విసిరారు.

అయితే ఈ వీడియోపై ఎక్స్ యూజర్లు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వీడియోలో నెతన్యాహు కాఫీ కప్పు పట్టుకున్న తీరు, ఆయన జేబులో నుంచి చేతులు బయటకు తీసిన విధానం సహజంగా లేవని నెటిజన్లు గుర్తించారు. ముఖ్యంగా నెతన్యాహు కిందకు చూసినప్పుడు ఆయన ముఖం ఆకారం గుండ్రం నుండి కోడిగుడ్డు ఆకారంలోకి మారిపోతోందని కొందరు క్లోజప్ షాట్స్ షేర్ చేశారు. వీటన్నింటికీ తోడు గ్రోక్ చాట్‌బాట్ స్పందిస్తూ.. ఆ వీడియో 100 శాతం అడ్వాన్స్‌డ్ ఏఐ డీప్‌ఫేక్ అని తేల్చేసింది. ఇలాంటి సంఘటన నిజంగా జరగలేదు. దీనిని అన్-రిలీజ్డ్ ఏఐ టెక్నాలజీతో సృష్టించారని బదులివ్వడం చర్చనీయాంశంగా మారింది.

ALSO READ : UAE ఫుజైరా పోర్టుపై ఇరాన్ మళ్లీ దాడులు

ఈ వివాదం ముదురుతుండటంతో ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం రంగంలోకి దిగింది. ఇవన్నీ కేవలం ఫేక్ న్యూస్ అని.. ప్రధానమంత్రి పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని స్పష్టం చేసింది. ఆయన కాఫీ తాగిన సటాఫ్ కేఫ్ యాజమాన్యం కూడా నెతన్యాహు తమ వద్దకు వచ్చిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అయినప్పటికీ.. ఏఐ యుగంలో నిజమేదో, అబద్ధమేదో తేల్చుకోలేక సామాన్య ప్రజలు అయోమయంలో పడ్డారు. యుద్ధ సమయంలో దేశాధినేతల భద్రత గురించి వచ్చే ఇలాంటి డీప్‌ఫేక్ వీడియోలు అంతర్జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు.