
బీహార్లోని కృష్ణ గంజ్ జిల్లాలో ఘటన
చెదిరిపోయిన 12 గ్రామాల ప్రజల కల, విచారణకు డిమాండ్
పట్నా: ప్రారంభోత్సవానికి ముందే ఓ బ్రిడ్జి కొట్టుకుపోయిన ఘటన బీహార్లో చోటుచేసుకుంది. నిర్మాణంలో క్వాలిటీ మెటీరియల్ వాడలేదని స్థాని కులు ఆరోపించగా.. కాంట్రాక్టర్ తిరస్కరించారు. కృష్ణ గంజ్ జిల్లా డిఘల్ బంక్ బ్లాక్లో పత్తర్ ఘట్టి పంచాయతీ పరిధిలోని గోదాబరి గ్రామం దగ్గర కంకై నదిపై రూ.1.42 కోట్లతో బ్రిడ్జి కట్టారు. కురైలి హాత్, బహదూర్ గంజ్ మధ్య గతేడాది జూన్లో పనులు మొదలుపెట్టి ఏడాది తర్వాత నిర్మాణం పూర్తిచేశారు. ప్రారంభోత్సవానికి రెడీగా ఉన్న బ్రిడ్జి.. వరద ఉధృతికి కొట్టుకుపోయింది. 12కుపైగా గ్రామాల సుదీర్ఘకాల కల కలగానే మిగిలిపోయింది. చాలా ఏళ్ల పోరాటం తర్వాత సాధించుకున్న బ్రిడ్జి.. ఇలా ప్రారంభించకుండానే కూలిపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. నాసిరకం మెటీరియల్ వల్లే బ్రిడ్జి కూలిపోయిందని, విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలను తోసిపుచ్చిన కాంట్రాక్టర్.. ఏ విచారణకైనా సిద్ధమని చెప్పారు. కాగా, ప్రకృతి విపత్తు వల్లే బ్రిడ్జి కూలిపోయిందని ఆర్అండ్బీ జూనియర్ ఇంజనీర్ ప్రకటించారు.
For More News..