హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీకి వెళ్తున్న తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. సోమవారం ఎస్సీ, ఎస్టీ కమిషన్కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. దుర్భాషలాడుతూ తమపై దాడికి దిగారని పేర్కొన్నారు. తమ హక్కులను హరించేలా ప్రవర్తించారని వాపోయారు. కొందరు నేతలకు గాయాలు కూడా అయ్యాయన్నారు. ఆదివాసీ మహిళ అయిన కోవా లక్ష్మిపైనా పోలీసులు అనుచితంగా ప్రవర్తించారన్నారు.
అనిల్ జాదవ్, మాణిక్ రావ్, విజేయుడు వంటి నేతలపైనా దాడి చేశారని ఆరోపించారు. నల్ల టీషర్టులను విప్పితేనే లోపలికి అనుమతిస్తామని చెప్పి మరింత అవమానించారన్నారు. పోలీసుల వ్యవహర శైలి తమను మానసిక వేదనకు గురి చేసిందన్నారు. దీనిపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ సుమోటోగా విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. తమపై దాడికి దిగిన పోలీసులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
