
- కేసీఆర్, కేటీఆర్కు మహా న్యూస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్
సూర్యాపేట, వెలుగు: మహా న్యూస్ టీవీ చానెల్ పై శనివారం జరిగింది దాడి కాదని, నిరసన మాత్రమేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు. తాము దాడులకు దిగితే తట్టుకోలేరని హెచ్చరించారు. మీడియా ముసుగులో ఇష్టమొచ్చినట్టు కామెంట్లు చేసి దాక్కుంటామంటే కుదరదని.. బిన్ లాడెన్ లాగా ఎక్కడ దాక్కున్నా పట్టుకుని, వాళ్ల పని చెప్తామన్నారు. ఆదివారం సూర్యాపేటలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
‘‘మా లీడర్ల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న మీడియా సంస్థలను వదిలిపెట్టం.. మా దాడి వేరే విధంగా ఉంటది” అని ఆయన హెచ్చరించారు. కేసీఆర్ కు గొప్ప క్షమాగుణం ఉందని, ఆయన క్షమించినా తాము క్షమించబోమన్నారు. కేసీఆర్, కేటీఆర్ పై ఇష్టారీతిన కామెంట్లు చేసిన మహా న్యూస్ చానెల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిని చూసి మురిసిపోతున్నవారిని భవిష్యత్తులో ఎవరూ కాపాడలేరన్నారు.
తమ ఫిర్యాదులపై పోలీసులు ప్రేక్షక పాత్ర వహించి, తమపైనే తప్పుడు కేసులు పెడుతున్నారని.. ఇక ప్రజా కోర్టులో శత్రువులకు శిక్షలు తప్పవన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నరలో అన్ని రంగాల్లోనూ విఫలమైందని విమర్శించారు. సాగునీటి రంగం గురించి ముఖ్యమంత్రి, నీటిపారుదల మంత్రికి ఏమీ తెలియదన్నారు. సూర్యాపేట జిల్లాలో కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయని అన్నారు. ఏ రాష్ట్రం కూడా ఎన్డీఎస్ఏ అనుమతుల కోసం ఎదురుచూడదని, రాజకీయ డ్రామాలు ఆపి వెంటనే కన్నేపల్లి పంపులు ఆన్ చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలన్నారు.