- కొనుగోలు చేసింది 5.22 లక్షల టన్నులు
- రైతుల అకౌంట్లలో రూ. 111 కోట్లు జమ
యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లాలో సవాళ్ల మధ్య యాసంగి సీజన్ వడ్ల కొనుగోలు ప్రక్రియ ముగిసింది. కొందరు మిల్లర్లు సరిగా సహకరించక పోవడం, టార్గెట్ను మించి వడ్లు కొనుగోలు చేయడంతో నిల్వ సమస్య కూడా తలెత్తింది. కొన్ని ప్రైవేటు గోడౌన్స్ రెంట్కు తీసుకొని నిల్వ చేశారు. ఈ యాసంగి సీజన్లో ఎన్నడూ లేని విధంగా 3.45 లక్షల ఎకరాల్లో వరిని సాగు చేశారు. ఈసారి కొత్తగా మార్కెట్లోకి వచ్చిన హైబ్రీడ్ సీడ్స్ సాగు చేయడంతో దిగుబడి కూడా పెరిగింది.
టార్గెట్ను మించి కొనుగోలు..
ఈ సీజన్లో 4.50 లక్షల టన్నుల వడ్లు కొనుగోలు చేయాలని సివిల్ సప్లయ్ డిపార్ట్మెంట్ టార్గెట్ పెట్టుకుంది. గతంలో మాదిరిగా జిల్లాలోని రైస్ మిల్లర్లు, మధ్య దళారులు వడ్లను కొనుగోలు చేయలేదు. దీంతో కొనుగోలు సెంటర్లకు వడ్లు పోటెత్తాయి. కొందరు మిల్లర్లు కూడా వడ్లు దించుకోకుండా ఇబ్బందులు పెట్టారు. ఈ పరిస్థితుల్లో 51,945 మంది రైతుల నుంచి 5.22 లక్షల టన్నుల వడ్లను సివిల్ సప్లయ్ డిపార్ట్మెంట్ కొనుగోలు చేసింది. దీంట్లో మిల్లర్లు 3.62 లక్షల టన్నులే తీసుకున్నారు. మిగిలిన ప్రైవేట్ గోడౌన్స్ తీసుకొని 1.11 లక్షల టన్నులను నిల్వ చేశారు.
ఇతర జిల్లాలకు 50 వేల టన్నుల వడ్లను తరలించారు. గడిచిన యాసంగి సీజన్లో జిల్లాలో 3.74 లక్షల టన్నులు కొనుగోలు చేయగా, ఈసారి 5.22 లక్షల టన్నులు కొనుగోలు చేశారు. ఆలేరు నియోజకవర్గంలో గడిచిన యాసంగి కంటే ఈసారి వంద శాతం వడ్ల కొనుగోలు ఎక్కువగా జరిగింది. కాగా, ఇప్పటి వరకూ రైతుల అకౌంట్లలో రూ. 111 కోట్లు జమ చేశారు. మరో రూ. 137 కోట్లు రెండు మూడు రోజుల్లో జమ చేస్తామని అడిషనల్ కలెక్టర్ వెంకారెడ్డి తెలిపారు.
