సస్పెండ్ చేసినట్టు బులెటిన్​ ఇవ్వండి : జగదీశ్​ రెడ్డి

 సస్పెండ్  చేసినట్టు బులెటిన్​ ఇవ్వండి :  జగదీశ్​ రెడ్డి
  • స్పీకర్​కు జగదీశ్​ రెడ్డి  వినతిపత్రం

హైదరాబాద్, వెలుగు: అన్యాయంగా తనను సభ నుంచి సస్పెండ్​ చేశారని బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే జగదీశ్​ రెడ్డి అన్నారు. సోమవారం అసెంబ్లీలో స్పీకర్​తో బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తన సస్పెన్షన్​కు సంబంధించి అధికారిక బులెటిన్​ ఇవ్వాలని స్పీకర్​కు జగదీశ్​ రెడ్డి వినతిపత్రం ఇచ్చారు. తనను సస్పెండ్​ చేసి ఇన్ని రోజులవుతున్నా ఇంకా అధికారిక బులెటిన్​ ఇవ్వకపోవడం ఏంటన్నారు. వారం రోజుల నుంచి దాని గురించి అడుగుతున్నా సరిగ్గా స్పందించడం లేదన్నారు. కాగా, అంతకుముందు అసెంబ్లీ లాబీలోకి వచ్చిన జగదీశ్​ రెడ్డిని చీఫ్​ మార్షల్స్​ అడ్డుకున్నారు. దీంతో సస్పెండ్​ చేసినట్టు బులెటిన్​ చూపించాలని చీఫ్​ మార్షల్​ను ఆయన ప్రశ్నించారు.

ఏ కారణంతో సస్పెండ్​ చేశారో చెప్పాలన్నారు. అసెంబ్లీని పద్ధతి ప్రకారం నడపడం లేదన్నారు. ఇష్టారాజ్యంగా నడుపుతున్నారని మండిపడ్డారు. మందబలంతో సభ నడుపుతామంటే కుదరదన్నారు. నల్గొండ జిల్లా మంత్రులు చిన్న కార్యక్రమమైనా హెలికాప్టర్​లో తిరుగుతున్నారని, జాన్​పహాడ్​ దర్గాలో జానారెడ్డి ఇచ్చిన దావత్​కు కూడా హెలికాప్టర్​లోనే వెళ్లారన్నారు. కాగా, అంతకుముందు రైతు రుణమాఫీపై  బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. హరీశ్​ రావు నేతృత్వంలోని పార్టీ ఎమ్మెల్యేలు నల్లబ్యాడ్జీలు ధరించి సభలోకి వెళ్లారు. రుణమాఫీపై చర్చించాలంటూ స్పీకర్​కు వాయిదా తీర్మానాన్ని అందించారు.