పీసీసీ చీఫ్ మహేశ్ కు కేటీఆర్ లీగల్ నోటీసులు

పీసీసీ చీఫ్ మహేశ్ కు కేటీఆర్ లీగల్ నోటీసులు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు లీగల్ నోటీసులు పంపించారు.  ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో ఉండగా, మీడియా ముందు తనపై  ఆధారాలు లేని ఆరోపణలు చేసినందుకు మహేష్ కుమార్ గౌడ్‌కు లీగల్ నోటీసులు పంపించారు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా తమపై, తమ పార్టీ నేతలపై  దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు.   మహేష్ కుమార్ గౌడ్ వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 

మహేశ్ కుమార్ ఏమన్నారంటే.?

గత  ప్రభుత్వం ఫోన్లు ట్యాప్ చేసే 2018లో అధికారంలోకి వచ్చిందని పీసీసీ చీఫ్  మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. జూన్ 17న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర సిట్ విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన ఫోన్ తో పాటు 650 మంది కాంగ్రెస్ నాయకుల ఫోన్లు హ్యాక్ అయ్యాయని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ కూడా హ్యక్ చేశారని, రైట్ టు ప్రైవెసీ అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని, దానినీ కాలరాశారని ఫైర్ అయ్యారు.  చట్టానికి వ్యతిరేకంగా అనేకమంది ఫోన్లు టాప్ చేశారని అన్నారు.   ఇలాంటి చర్యకు పాల్పడ్డ నాటి సీఎం కేసీఆర్, కేటీఆర్ ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేశారని మండిపడ్డారు. 2022 నుంచి సీనియర్ కాంగ్రెస్ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ లో ఉన్నాయన్నారు.  

అనిల్ కుమార్ యాదవ్, అనిల్ తోపాటు అనేకమంది ఫోన్లు టాప్ అయినట్లు తెలుస్తోందని చెప్పారు. వాళ్లు ఎలా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారో అర్థమవుతోందన్నారు.  రిటైర్డ్ అయిన ప్రభాకర్ రావును దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఇంటెలిజెన్స్ చీఫ్ గా పెట్టి దుశ్చర్యకు పాల్పడడం సిగ్గుచేటు అని ఫైర్ అయ్యారు.