చండీగఢ్: ఇండియాలోకి అక్రమంగా చొరబడాలని యత్నించిన ఐదుగురిని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) మట్టుబెట్టింది. పంజాబ్లోని ఇండియా–పాకిస్తాన్ ఇంటర్నేషనల్ బార్డర్ ద్వారా మన దేశంలోకి చొరబడాలనుకున్న వారి యత్నాలను విఫలం చేసింది. 3,300 కిలో మీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ బార్డర్లో ఒకేసారి ఐదుగురు చొరబాటుదారులను చంపేయడం గత దశాబ్ద కాలంలో ఇదే మొదటిసారని తెలుస్తోంది.
పాకిస్తాన్తో పంజాబ్కు 553 కి.మీల మేర పొడవైన సరిహద్దు ఉంది. జమ్మూ, రాజస్థాన్, గుజరాత్లతోపాటు పంజాబ్ కూడా ఇంటర్నేషనల్ బార్డర్ (ఐబీ)లో దాయాది దేశంతో ఎక్కువగా సరిహద్దును కలిగి ఉంది. తారన్ తారన్ జిల్లాలోని ఐబీ దగ్గర 103వ బెటాలియన్ దళాలు అనుమానాస్పద కదలికలను గమనించాయి. బీఎస్ఎఫ్ జవాన్లు ఆపమని చెప్పగా, చొరబాటుదారులు కాల్పులకు దిగారు. దీంతో ఆత్మ రక్షణ కోసం జవాన్లు ఎదురు కాల్పులకు దిగారు. ఈ దాడిలో ఐదుగురు చొరబాటుదారులు మృతి చెందారు. ఈ ఘటన జిల్లాలోని బిఖ్విండ్ టౌన్కు సమీపంలో దాల్ బార్డర్ పోస్ట్ వద్ద ఉదయం 4.45 గంటలకు జరిగిందని బీఎస్ఎఫ్ అధికారి చెప్పారు.