హైదరాబాద్ లో బైక్ దొంగల ముఠా అరెస్ట్..

హైదరాబాద్ లో బైక్ దొంగల ముఠా అరెస్ట్..

హైదరాబాద్ నగరంలోని బైక్స్ దొంగతనం చేసే ముఠాను పట్టుకున్నారు పోలీసులు. సోమవారం నాడు మోటార్‌సైకిల్ చోరీకి పాల్పడుతున్న సమయంలో ఇద్దర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  వారి వద్ద నుంచి 14 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు శ్యాంస్ బిలాల్, రాసూరి సుకేశ్వర్ అలియాస్ లోకేష్ గా గుర్తించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కే శ్రీనివాస రెడ్డి స్పందిస్తూ  విలాసవంతమైన జీవనశైలికి అలవాటుపడి నగరంలో బైక్‌లు, స్కూటర్లను దొంగిలిస్తున్నారని తెలిపారు.

స్వాధీనం చేసుకున్న వాహనాలు మధురానగర్, ఖైరతాబాద్, మీర్‌పేట్, రాజేంద్రనగర్, హుమయూన్‌నగర్, పటాన్‌చెరువు, గుడిమల్కాపూర్, అబిద్ రోడ్, సరూర్‌నగర్, చాంద్రాయణగుట్ట, హుమాయూన్‌నగర్‌తో సహా పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీకి గురైనట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేశామని విచారణ చేపట్టి మరిన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.